ఇంటికెళ్లేందుకు రూ.1.5 ల‌క్షలు ఖ‌ర్చు పెట్టాడు! | UP Man Buys Second Hand Car To Return Home In Gorakhpur | Sakshi
Sakshi News home page

రైలులో సీటు దొర‌క‌లేద‌ని కారు కొన్నాడు

Jun 3 2020 2:17 PM | Updated on Jun 3 2020 2:37 PM

UP Man Buys Second Hand Car To Return Home In Gorakhpur - Sakshi

ఘ‌జియాబాద్‌:  లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఓ వ్యక్తి తన స్వస్థలానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనాన్ని దొంగిలించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ వ్య‌క్తి అందుకు భిన్నంగా స్వ‌స్థ‌లానికి చేరుకునేందుకు మ‌రో మార్గాన్ని ఎంచుకున్నాడు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో కుటుంబంతో స‌హా చిక్కుకుపోయిన‌ లల్లాన్ అనే వ్య‌క్తి స్వ‌స్థ‌లమైన గోర‌ఖ్‌పూర్‌లోని కైతోలియా గ్రామానికి వెళ్లాల‌ని నిశ్చ‌యించుకున్నాడు. ఇందుకోసం శ్రామిక్ రైలులో సీట్లు బుక్ చేసుకునేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ సీటు దొర‌క‌లేదు. అటు బ‌స్సులో వెళ్దామనుకుంటే కిక్కిరిసి ఉండే జ‌నాభా వ‌ల్ల క‌రోనా సోకే అవ‌కాశాలుంటాయ‌ని కాస్త భ‌యాందోళ‌న‌కు గుర‌య్యాడు. దీంతో ల‌ల్లాన్ మ‌రో ప్ర‌త్యామ్నాయం ఆలోచించాడు. (శ్రామిక్‌ రైలులో విషాదం.. 5 రోజుల తర్వాత..)

ఇప్ప‌టివ‌ర‌కు దాచుకున్న డ‌బ్బుతో సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. దీని కోసం రూ.1.5 ల‌క్ష‌లు వెచ్చించాడు. ఆ కారులో మే 29న ఘ‌జియాబాద్ నుంచి బ‌య‌లు దేరగా 14 గంట‌ల త‌ర్వాత ఆ కుటుంబం ఇంటికి చేరుకుంది. ప్ర‌స్తుతం కుటుంబ స‌భ్యులంద‌రూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విష‌యం గురించి ల‌ల్లాన్ మాట్లాడుతూ.. 'లాక్‌డౌన్ త‌ర్వాత అన్ని ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి వ‌స్తాయ‌ని ఆశిస్తున్నాను. ప్ర‌స్తుత స‌మ‌యంలో నేను, నా కుటుంబం స్వ‌గ్రామానికి తిరిగి వెళ్ల‌డ‌మే మంచిద‌ని భావించాను. దీంతో బ‌స్సులో కానీ రైలులో కానీ సీట్లు పొందేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నించినప్ప‌టికీ ఫ‌లితం ద‌క్క‌లేదు. అందుకే పైసా పైసా కూడ‌బెట్టిన డ‌బ్బుతో కారు తీసుకుని ఇంటికి చేరుకున్నాం. ఇక్క‌డే ఏదైనా ప‌ని దొరికితే ఘ‌జియాబాద్‌కు తిరిగి వెళ్ల‌'న‌ని పేర్కొన్నాడు. ('నా చావుకు లాక్‌డౌన్‌ పొడిగింపే కారణం')

Advertisement
 
Advertisement
Advertisement