పశ్చిమ బంగ్లాదేశ్‌గా బెంగాల్‌..!

Mamata Trying To Make West Bangladesh In West Bengal - Sakshi

కలకత్తా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోకి చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ దిలీప్‌ ఘోష్‌ ఆరోపించారు. ఈ చొరబాట్ల కారణంగా పశ్చిమ బెంగాల్‌ను కాస్తా ‘పశ్చిమ బంగ్లాదేశ్‌’గా మార్చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మమతా బెనర్జీ ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో బెంగాల్‌, బంగ్లాదేశ్‌ను కలిపి పశ్చిమ బంగ్లాదేశ్‌గా ఏర్పాటు చేయాలనుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు.

భారతదేశం నుంచి బెంగాల్‌ను దూరం చేయాలని ఆమె కుట్రకు పాల్పడుతోందన్నారు. సోమవారం భట్‌పారా అల్లర్లలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించిన ఆయన.. టీఎంసీ బెంగాల్‌ను మరో పాకిస్తాన్‌గా మార్చాలనుకుంటుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భట్‌పారా అల్లర్ల సమస్యకు పరిష్కారం చూపడం లేదన్నారు. ఇక్కడి బాధితులకు న్యాయం జరిగే  పరిస్థితులు కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించడానికి బీజేపి ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి గూండాలను తీసుకువస్తోందని కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై ఘోష్‌ స్పందిస్తూ.. బెంగాల్‌ను  పాకిస్తాన్‌గా మర్చే ఉద్దేశంతో ‘జై శ్రీరామ్‌ నినాదాలను’ రాష్ట్రంలో అనుమతించడం లేదన్నారు.  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం 42 పార్లమెంట్‌ స్థానాల్లో.. 18 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తృణమూల్‌ కాంగ్రెస్‌ 22 స్థానాలను గెలుచుకొని కొంత బలాన్ని కోల్పోయిన సంగతి విదితమే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top