జనతా కర్ఫ్యూ: లైవ్‌ అప్‌డేట్స్‌

Janata Curfew All Over India Live Updates - Sakshi

కంటికి కనిపించని మహమ్మారిపై యుద్ధానికి కేంద్రం నడుం బిగించింది. ప్రజల సంపూర్ణ సహకారంతో చికిత్స లేని కరోనా వైరస్‌ను తరిమేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. సామాజిక దూరం పాటిస్తేనే భారత్‌ కోవిడ్‌పై పోరులో విజయవంతమవుందని ప్రకటించారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలందరూ ఇళ్లలోనే గడపాలని కోరారు. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టదిట్టమైన చర్యలు చేపట్టాయి. ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో భాగం కావడంతో.. దేశ వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. వాహనాలు, రైళ్లను రద్దు చేశారు. విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈనేపథ్యంలో జాతీయ స్థాయిలో జనతా కర్ఫ్యూపై లైవ్‌ అప్‌డేట్స్‌..

  • కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు కరోనా నియంత్రణకు పనిచేస్తున్న వైద్యులు, మిగతా అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందికి యావత్‌ భారతావని చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలిపింది.
     
  • దేశంలో కరోనా కేసులు నమోదైన 75 జిల్లాల్లో నిత్యావసర వస్తువులు మినహా అన్ని సర్వీసులపై కేంద్రం నిషేధం విధించింది. అలాగే అంతరాష్ట్ర సర్వీసులను మార్చి 31 వరకు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణాపై ఆంక్షలు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.
  • పంజాబ్‌లో ఆదివారం మరో ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో పంజాబ్‌లో మొత్తంగా కరోనా సోకినవారి సంఖ్య 21కి చేరింది.
     
  • కరోనా కట్టడికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు అన్ని ప్యాసెంజర్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. ఇక ప్రధాని పిలుపు మేరకు నేడు (జనతా కర్ఫ్యూ) మెట్రో సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో, బెంగళూరు మెట్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా భారతీయ రైల్వే కూడా అన్ని రైళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

  • జనతా కర్ఫ్యూ పాటించకుండా రోడ్లపైకి వచ్చిన వారిని ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు వినూత్నంగా అడ్డుకున్నారు. దయచేసి ఇళ్లళ్లలోని వెళ్లిపోండని పూలు అందించి విజ్ఞప్తి చేశారు.

జయహో జనతా  : (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

  • కరోనా భయాల నేపథ్యంలో షహీన్‌బాగ్‌లో పౌరసత్వ నిరసనకారులు చాలా మంది స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. ఇక జనతా కర్ఫ్యూ నేపథ్యంలో షహీన్‌బాగ్‌ వద్ద నిరసన కార్యక్రమాలకు ఐదుగురిని మాత్రమే అనుమతించారు. అయితే, నిరసనకారులు చేరుకునేలోపే కొందరు దుండగులు అక్కడ పెట్రోల్‌ బాంబు వేసి పారిపోయారు. స్థానికులు మంటల్ని ఆర్పివేశారు.


నిర్మానుష్యంగా ముంబైలోని మహాత్మా ఫూలే బజార్‌.. పరిసర ప్రాంతాలు

  • జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మెడిటేషన్‌ చేయాలని ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ పిలుపునిచ్చారు. మెడిటేషన్‌కు ఇదే సరైన సమయమని, ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఇంగ్లిష్‌లో,
    మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో ఆన్‌లైన్‌ మెడిటేషన్‌ క్లాస్‌ నిర్వహిస్తున్నామని అన్నారు.

  • ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాపై క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రశంసలు కురిపించాడు. జనతా కర్ఫ్యూతో పాఠశాలలో మాదిరిగా దేశమంతా పిన్‌ డ్రాప్‌ సైలెన్స్‌గా ఉందని తెలిపాడు. వచ్చే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, ప్రజలంతా సామాజిక దూరాల్ని పాటించాలని సూచించారు.
     
  • ఇటలీలోని రోమ్‌ నగరంలో చిక్కుకున్న 263 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొచ్చారు.
    (చదవండి: ఏంటయ్యా ఇంట్లోనే కూర్చోమంటున్నారు!)

  • పట్నాలో డ్యూటీలో ఉన్న పోలీసులు, మీడియా సిబ్బందికి రాకేశ్‌ చౌదరీ అనే వ్యక్తి శానిటైజర్‌ ఇచ్చి మద్దతుగా నిలిచాడు. దేశమంతా కరోనాపై పోరాటం చేస్తోందని, స్వచ్ఛదంగా ఈ పోరులో భాగమయ్యాయని రాకేశ్‌ తెలిపాడు.

  • ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై మహా నగరాల్లో అన్ని సబర్బన్‌ రైలు సర్వీసుల్ని ఆదివారం నిలిపివేశారు. ఢిల్లీలో మెట్రో రైలు సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.  

     
  • మార్చి 21 అంటే శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్యాసింజర్‌ సర్వీసుల్ని నిలిపివేసింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచిమెయిల్, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు నిలిచిపోయాయి. ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లు కూడా రాత్రి 10 గంటలవరకు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా 3,700 రైళ్లను రద్దు చేశారు.  
  • గో ఎయిర్‌ విమానయాన సంస్థ స్వచ్ఛందంగా ఆదివారం అన్ని విమాన సర్వీసుల్ని నిలిపివేసింది. భారత్‌లో అత్యధిక విమాన సర్వీసుల్ని నడిపే ఇండిగో 60% వరకు డొమెస్టిక్‌ సర్వీసుల్నినడుపుతోంది. ఎయిర్‌ విస్తా తన సర్వీసుల్ని బాగా కుదించింది. 

     
  • ఢిల్లీలో 15 లక్షల మంది వ్యాపారులు తమ దుకాణాలు బంద్‌ చేశారు. వారిలో కొందరు మార్చి 21 నుంచి 23 వరకు బంద్‌ పాటిస్తున్నారు.
  • గుజరాత్, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూకు మద్దతుగా బస్సు సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top