
ఇడుక్కీ డ్యామ్ గేట్లు ఎత్తివేత
భారీ వర్షాలతో ఇప్పటి వరకు 26 మంది మృతిచెందగా...
తిరువనంతపురం : కేరళలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటి వరకు 26 మంది మృతిచెందగా మరికొంత మంది గల్లంతైన విషయం తెలిసిందే. భారీ వర్షాలతో ఇబ్బందిపడుతున్న కేరళవాసులకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఆర్ఎఫ్ దళాలను అదేశించారు. విపత్తు నిర్వహణ వర్గాల సమాచారం ప్రకారం గురువారం ఉదయం ఇడుక్కీ, మలప్పురం, కన్నూర్ జిల్లాలో భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడి 10 మంది మృతి చెందారు. తాగునీరు, తిండిలేక గత మూడు రోజులుగా కేరళ వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు సహాయచర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలకు అప్రమత్తం చేసి, పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. భారీ వర్షాలతో ఇడుక్కీ రిజర్వాయర్ నీటి మట్టం పెరిగిపోయింది. డ్యామ్ గరిష్ట నీటిమట్టం 2,403 అడుగులు కాగా, గురువారం సాయంత్రం నాటికి 2,398 అడుగులకు చేరింది. వరద ఉదృతి పెరగడంతో అధికారులు గేట్లను ఎత్తివేశారు. కాగా 26 ఏళ్ల తరువాత ఇడుక్కీ డ్యామ్ గేట్లను ఎత్తివేయడం ఇదే తొలిసారి. కాగా ప్రంపంచంలోనే రెండవ అతి పెద్ద వంపైన ఆనకట్ట కలిగిన ప్రాంతంగా ఇడుక్కి ప్రసిద్ది చెందింది.