నిర్జీవ లేఖగా మార్చొద్దు | Dont change as dead letter | Sakshi
Sakshi News home page

నిర్జీవ లేఖగా మార్చొద్దు

Nov 24 2016 1:12 AM | Updated on Sep 2 2018 5:24 PM

లోక్‌పాల్ నియామకంలో కేంద్రం జాప్యాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. చట్టం ఓ ‘నిర్జీవమైన లేఖ’గా మారడాన్ని అనుమతించరాదని స్పష్టం చేసింది.

లోక్‌పాల్ నియామకంలో జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి
 
 న్యూఢిల్లీ: లోక్‌పాల్ నియామకంలో కేంద్రం జాప్యాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. చట్టం ఓ ‘నిర్జీవమైన లేఖ’గా మారడాన్ని అనుమతించరాదని స్పష్టం చేసింది. అతిపెద్ద విపక్ష నేతను లోక్‌పాల్ ఎంపిక కమిటీలో చేర్చేలా చట్టాన్ని సవరించలేదనే పేరిట.. దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో రూపుదాల్చిన లోక్‌పాల్ చట్టాన్ని నిష్ర్పయోజనమైన దానిగా మార్చలేరని ధ్వజమెత్తింది.  ప్రతిపక్ష నేత ఎంపిక కమిటీలో ఉండాలని  లోక్‌పాల్, లోకాయుక్తల చట్టం చెబుతుండటం, ప్రస్తుత లోక్‌సభలో ప్రతిపక్ష నేత లేని పరిస్థితుల్లో.. కేంద్రం  లోక్‌పాల్‌ను నియమించకుండా జాప్యం చేస్తూ వచ్చింది.

అయితే అది సడలించదగిన అంశమేనని, అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతను కమిటీలో చేర్చడం ద్వారా ప్రక్రియను ముందుకు కొనసాగించవచ్చని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ బుధవారం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ పార్లమెంటులో పెండింగ్‌లో ఉందని కేంద్రం చెప్పడంపై కోర్టు  అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్ట సవరణ చేయకపోవడం ద్వారా లోక్‌పాల్ నియామకానికి సంబంధించి ప్రజాభిప్రాయానికి తూట్లు పొడవజాలరని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement