
బీజేపీలో చేరడానికి ముందు నరేంద్ర మోదీని కలిసిన కిరణ్ బేడీ
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ బీజేపీలో చేరారు.
* బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో చేరిక
* ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మాజీ ఐపీఎస్
* మోదీ స్ఫూర్తితోనే చేరానని, కేజ్రీవాల్పై పోటీకి సిద్ధమని వ్యాఖ్య
* ఆప్ మాజీ నాయకురాలు షాజియా ఇల్మీకీ బీజేపీ సభ్యత్వం
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ బీజేపీలో చేరారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో గురువారం ఆమె బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బేడీ పోటీ చేస్తారని ఈ సందర్భంగా అమిత్ షా చెప్పారు. తమ పార్టీ సీఎం అభ్యర్థిని తర్వాత ప్రకటిస్తామన్నారు. బేడీ చేరిక వల్ల ఢిల్లీలో బీజేపీ బలపడుతుందని పేర్కొన్నారు. అనుభవం, విశ్వసనీయత కలిగిన బేడీని పార్టీలో చేర్చుకోవడం తమకు ఎంతో లాభిస్తుందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. కాగా, పార్టీ ఆదేశిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై పోటీ చేయడానికి సిద్ధమని కిరణ్ బేడీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ స్ఫూర్తితోనే బీజేపీలో చేరినట్లు చెప్పారు. తనకున్న 40 ఏళ్ల పాలనానుభవాన్ని ఢిల్లీ అభివృద్ధి కోసం వినియోగిస్తానన్నారు.
రాష్ట్రానికి పటిష్టమైన, అనుభవం కలిగిన సుస్థిర ప్రభుత్వం అవసరముందన్నారు. తనకు పనిచేయడం, పనిచేయించడం వచ్చునని ఆమె వ్యాఖ్యానించారు. తాను స్థాపించిన రెండు స్వచ్ఛంద సంస్థలు 26 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్నాయని వివరించారు. కాగా, కిరణ్ బేడీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని అమిత్ షా వెల్లడించలేదు. ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కాగల సత్తా ప్రతి బీజేపీ కార్యకర్తకు ఉందని, సీఎం అభ్యర్థిని పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. మరోవైపు బీజేపీలో ఆమె చేరిక షాక్కు గురిచేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.
అయితే రాజకీయాల్లో చేరాలని కిరణ్ బేడీని ఒప్పించడానికి గతంలో తీవ్రంగా ప్రయత్నించానని, ఇప్పటికైనా ఆమె ఆ పని చేశారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఢిల్లీ అభివృద్ధి కోసం తాను పోరాడుతుంటే, తనను ఓడించడానికే బీజేపీ కంకణం కట్టుకున్నదని పేర్కొన్నారు. ఇక ఏడాది కాలంగా కిరణ్బేడీ తనతో మాట్లాడలేదని అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నాహజారే తెలిపారు. ఆమె బీజేపీలో చేరే విషయం కూడా తనకు తెలియదని చెప్పారు. మరోవైపు ఆప్ మాజీ నాయకురాలు షాజియా ఇల్మీ కూడా బీజేపీలో చేరారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. మార్పు, అభివృద్ధి ఎజెండాతో బీజేపీ కొత్త ఒరవడిని సృష్టిస్తోందని ఆమె కొనియాడారు. ప్రధాని మోదీ స్ఫూర్తితోనే పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీ ఆదేశాలను అనుసరిస్తానని పేర్కొన్నారు.
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిపై ఆప్ ఆరోపణలు
బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయకు విద్యుత్ పంపిణీ సంస్థ బీఎస్ఈఎస్తో ఆర్థిక సంబంధాలున్నాయన్న ఆరోపణలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇందుకు సంబంధించి న ఆధార పత్రాలను కూడా ఆమ్ఆద్మీ పార్టీ బయటపెట్టింది. సతీశ్ ఉపాధ్యాయ వెంటనే రాజకీయాల నుంచి వైదొలగాలని డిమాండ్ చేసింది. ఆయనకు ఆరు కంపెనీలు ఉన్నాయని, అందులో రెండింటికి చట్టవిరుద్ధంగా ఒకటికన్నా ఎక్కువ వ్యాట్ నంబర్లు ఉన్నాయని ఆప్ నేత కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరోవైపు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ అరవింద్ కే జ్రీవాల్కు సతీశ్ ఉపాధ్యాయ లీగల్ నోటీసులు పంపారు. బీఎస్ఈఎస్తో సంబంధాలున్న ఎన్సీఎన్ఎల్ కంపెనీతో తనకెలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.