
కోవిడ్ బాధితుల్లో రికవరీ శాతం 26.59 గా ఉండటం సానుకూల పరిణామం.
న్యూఢిల్లీ: కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 83 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం ప్రకటించింది. కొత్తగా 2,644 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఒకే రోజు ఇన్ని కేసులు బయటపడడం ఇదే తొలిసారి అని పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39,980కి చేరిందని తెలిపింది. ఇప్పటివరకు 10,663 మంది వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. తాజా మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 1301కి చేరుకుందని, ప్రస్తుతం దేశంలో 28,046 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో వివరించింది. కోవిడ్ బాధితుల్లో రికవరీ శాతం 26.59 గా ఉండటం సానుకూల పరిణామం.
(చదవండి: రెడ్ జోన్లో మినహాయింపులకు నో..)
కాగా, గత వారం రోజుల వ్యవధిలోనే భారత్లో 13 వేల కేసులు, 700 మరణాలు సంభవించడం గమనార్హం. ఇక మూడో దశ లాక్డౌన్ను మే 3 నుంచి మే 17 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ కేసులు నమోదైన వివరాల ఆధారంగా ఆయా ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా కేంద్రం విభజించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్డౌన్ సడలింపులు ఉండగా.. రెడ్ జోన్లలో కఠిన నిబంధనలు కొనసాగనున్నాయి. ఇక 12 వేల పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర దేశంలో తొలి స్థానంలో ఉంది. దేశంలోని మొత్తం కేసుల్లో పాతిక శాతానికిపైగా కేసులు అక్కడే ఉన్నాయి.
(చదవండి: కరోనా యోధులకు గౌరవ వందనం)