లాక్‌డౌన్‌ 4:0: నేడు కొత్త మార్గదర్శకాలు

Central May Release New Guidelines On Lockdown - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ 4:0 మినహాయింపులకు సంబంధించి నేడు (శనివారం) కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. రెడ్‌జోన్లలో తప్ప మిగతా ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మినహాయింపులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు కంటైన్‌మెంట్‌ జోన్లో మినహా రవాణా వ్యవస్థకు సడలింపులు ఇవ్వాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. రాష్ట్ర సరిహద్దులు దాటితే వైరస్‌ వ్యాప్తి ప్రభావం పెరిగే అవకాశం ఉండటంతో రైళ్లు, విమానాల ప్రయాణాలు ఇప్పుడే వద్దని కేంద్రానికి సూచిస్తున్నాయి. ఇక నాలుగో దశ లాక్‌డౌన్‌లో ముఖ్యంగా ఆర్థిక, వ్యవసాయాధారిత కార్యకలాపాలకు మరిన్ని సడలింపులు ఇచ్చే  దిశగా కేంద్ర నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. (లాక్‌డౌన్‌ 4.0: అమిత్‌ షా కీలక భేటీ)

మరోవైపు వైరస్‌ ప్రభావం ఇప్పటితో తగ్గే అవకాశం లేకపోవడంతో ఆంక్షలతో కూడిన ప్రజా రవాణాకు మొగ్గు చూపే అవకాశం ఉంది. వైరస్‌ ప్రభావిత ప్రభావిత ప్రాంతాలను బట్టి.. సెలెక్టివ్ ప్రాంతాల నడుమ విమాన సర్వీసులకు నడిపే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇక రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు రెడ్‌జోన్లపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకే వదిలివేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. రెండు గజాల దూరంతో విమాన, బస్సు సర్వీసులు, వ్యక్తిగత వాహనాలు, ఆటోలు, టాక్సీలు తిరగడానికి వీలు కలిపించే అవకాశం ఉంది. ఇక పరిమిత సామర్థ్యంతో స్థానిక రైళ్లు, మెట్రోలకూ అవకాశం కల్పించాలని ఢిల్లీ సర్కార్‌ ఇదివరకే కేంద్రానికి లేఖ రాసింది. అలాగే ఇటీవల ముగిసిన ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎంలు చేసిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని కేంద్రం నూతన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. (దేశంలో 3,970 పాజిటివ్‌ కేసులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top