తండ్రి మృతదేహం పక్కన 5 రోజులు కూర్చుని... | Sakshi
Sakshi News home page

తండ్రి మృతదేహం పక్కన 5 రోజులు కూర్చుని...

Published Tue, May 2 2017 8:24 AM

తండ్రి మృతదేహం పక్కన 5 రోజులు కూర్చుని... - Sakshi

మదురై: చనిపోయిన తండ్రి మృతదేహం పక్కన ఆయన కుమారుడు ఐదు రోజులపాటు అలాగే కూర్చున్న ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. మదురైలోని జీవనగర్‌లో అరుల్ రాజ్(73) కుటుంబం నివాసం ఉంటోంది. ఆయనకు 40 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతడి మానసిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ క్రమంలో వృద్ధుడైన అరుల్ రాజ్ గత వారం చనిపోయాడు.

ప్రతిరోజు నీళ్లు పట్టేందుకు వచ్చే అరుల్ రాజ్ ఐదు రోజులుగా  కనిపించకపోవడంతో పాటు ఆ ఇంటి నుంచి భరించరాని దుర్వాసన వస్తుండటంతో జీవనగర్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటికి వెళ్లి డోర్ కొట్టగా ఎవరూ డోర్ తెరవకపోవడంతో తలుపులు పగలకొట్టి లోనికి వెళ్లి చూసిన పోలీసులు షాక్ తిన్నారు. కుళ్లిపోతున్న వృద్ధుడి మృతదేహం పక్కన అతడి కుమారుడు ఉండటం చూసి అతడే హత్య చేసి ఉంటాడని భావించారు. అతని ప్రవర్తనను గమనించిన పోలీసులు, స్థానికులను వాకబు చేసి అరుల్ కుమారుడికి మానసికస్థితి బాగాలేదని తెలుసుకున్నారు.

తండ్రి అరుల్ రాజ్ చనిపోయాడని గుర్తించలేని ఆయన కుమారుడు గత ఐదు రోజులుగా మృతదేహం వద్ద కూర్చుని ఉన్నాడు. ఎలాంటి ఆహారం తీసుకోలేదని, కనీసం నీళ్లు కూడా తాగకపోవడంతో డీహైడ్రేషన్‌కి లోనయ్యాడని పోలీసులు చెప్పారు. ఆ వృద్ధుడు కనిపించకుండాపోయిన ఏప్రిల్25వ తేదీనే చనిపోయి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. బ్రిట్టోను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement