అయ్యో పాపం...అమిత్ షా! | Amit shah plan fail in delhi polls | Sakshi
Sakshi News home page

అయ్యో పాపం...అమిత్ షా!

Feb 10 2015 5:26 PM | Updated on May 28 2018 3:58 PM

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రస్తుతం ఇక్కడ తన కుమారుడు జాయ్ షా పెళ్లి వేడుకల్లో తలమున్కలై ఉన్నారు.

అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రస్తుతం ఇక్కడ తన కుమారుడు జాయ్ షా పెళ్లి వేడుకల్లో తలమున్కలై ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్ ఫిబ్రవరి ఏడవ తేదీన ముగిసిన వెంటనే ఆయన హుటిహుటిన పెళ్లి పనులను చక్చబెట్టుకోవడం కోసం పెట్టాబేడా పట్టుకొని వచ్చేశారు. పెళ్లికి తరలిరానున్న పార్టీ అథిరథ , మహారథుల కోసం నగరంలోని స్టార్ హోటళ్లలో వందలాది గదులను బుక్‌చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని, రెండు వేడుకలకు ఒకే వేదిక నుంచి ఘనంగా జరుపుకోవచ్చని మురిసిపోయారు. అయితే ఊహించని ఫలితాలు వెలువడడంతో పాపం ఆయన ముఖంకాస్త ముడుచుకుపోయే ఉంటుంది. ఎందుకంటే మంగళవారం ఉదయం వరకు కూడా పార్టీ నుంచి అథితులెవరూ నగరానికి చేరుకోలేదు. పార్టీ అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, మనోహర్ పారీకర్ తదితరులు రావాల్సి ఉంది. ఢిల్లీ బీజేపీ పార్టీ కార్యాలయంలో కూడా ఈ రోజు ఉదయం నుంచి కనిపించని వీరు పెళ్లికి బయల్దేరారా లేదా అన్న విషయం తెలియడంలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెళ్లికి వస్తారని స్థానిక బీజేపీ నాయకులు ఆశించారు. నగరానికి మోదీ రాక ఆయన షెడ్యూల్లో ఉందో, లేదో తెలియదుగానీ ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఇక ఆయన రారని అందరూ భావిస్తున్నారు. భద్రతా దళాలు మాత్రం పెళ్లి వేదిక వద్ద డాగ్ స్కాడ్‌లను దించి హడావిడి చేస్తున్నాయి.

 ఢిల్లీ ఫలితాలు వెలువడే రోజే తన కుమారుడు జాయ్ షా పెళ్లిని అమిత్ షా ఉద్దేశపూర్వకంగా పెట్టుకోలేదు. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక చాలా ముందే...అంటే గతేడాది జూలై నెలలోనే కుమారుడి పెళ్లి ఖాయం చేసుకున్నారు. జాయ్ షా తన క్లాస్‌మేట్ రుషితా పటేల్‌ను ఈ రోజు రాత్రికి పెళ్లి చేసుకుంటున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పెళ్లి వేడుకలను నిరాడంబరంగానే ముగించి ఈనెల 15వ తేదీన ఢిల్లీలో జరుగనున్న రిసెప్షన్‌ను మాత్రం ఘనంగా నిర్వహించాలని అమిత్ షా భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలియజేశాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement