శబరిమల ఆందోళనల్లో 1,500 మంది అరెస్టు
తిరువనంతపురం: ఇటీవల శబరిమల ఆలయంలో ఇటీవలి పూజల సందర్భంగా హింసాత్మక చర్యలకు పాల్పడిన వారి కోసం కేరళ పోలీసులు జల్లెడపడుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన 10 నుంచి 50 ఏళ్ల మహిళలపై దాడికి యత్నించిన, హింసాత్మక చర్యలకు పాల్పడిన సుమారు 2 వేల మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎర్నాకులం, కోజికోడ్, పలక్కడ్, త్రిసూర్, కొట్టాయం, అలప్పుజ తదితర ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో దాడులు జరిపి 1,500 మందిని అరెస్టు చేశారు. మరో 210 మంది కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే మండల పూజల నేపథ్యంలో 5వేల అదనపు బలగాలను మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.