
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో మొత్తం 5.93 కోట్ల మంది ఓటర్లుండగా.. ఎన్నికల కమిషన్(ఈసీ) నిర్వహించిన సర్వేలో 11 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నట్లు తేలింది. వీరిని ఏరివేయడంపై ఈసీ దృష్టి సారించింది. వీరిలో అధిక శాతం మంది ఉద్ధేశపూర్వకంగా నకిలీ ఓటర్లుగా చలామణి అవుతున్నట్లు గుర్తించారు. కొందరు మాత్రం ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం వేరే జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లిపోవడం వల్ల నకిలీ ఓటర్లుగా ముద్రపడ్డారు.
మరోసారి సర్వే నిర్వహించి అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్లో 30,495 మంది నకిలీ ఓటర్లను గుర్తించారు. పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లు ఉన్నట్లు తేలడంతో ఈ విషయాన్ని ఈసీ సీరియస్గా తీసుకుంది.