నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను | Sakshi
Sakshi News home page

నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను

Published Fri, Jun 12 2020 12:37 AM

Vidya Balan shares pics on Parineeta movie is 15th anniversary - Sakshi

‘‘నేను నిన్ను ప్రేమించాను.. ఇప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాను.. ఇప్పుడే కాదు.. నిన్ను ఎప్పటికీ ఎక్కువగా ప్రేమిస్తాను... నా ప్రియమైన సినిమా’’ అంటున్నారు విద్యాబాలన్‌. ఎన్నో సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్న ఆమె ఇప్పుడు సినిమా మీద తనుకున్న ప్రేమను చెప్పడానికి ఓ కారణం ఉంది. ‘పరిణీత’తో విద్యాబాలన్‌ హిందీ తెరకు పరిచయమై జూన్‌ 10తో 15 ఏళ్లయింది. ఈ విషయాన్ని ప్రస్తావించి, సినిమా మీద తనకున్న ప్రేమ గురించి కూడా చెప్పారామె. సంజయ్‌ దత్, సైఫ్‌ అలీఖాన్, రైమా సేన్, దియా మీర్జా, విద్యాబాలన్‌ తదితరులు నటించిన ‘పరిణీత’ విద్యాకి మంచి పేరు తెచ్చింది.

బెంగాలీ మహిళగా ఆ చిత్రంలో చక్కగా నటించారు విద్యాబాలన్‌. నటిగా 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ‘పరిణీత’ షూటింగ్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి, ఓ వీడియో షేర్‌ చేశారు. ‘‘ప్రపంచానికి తెలియక ముందే శేఖర్‌లో లోలిత సగభాగం అయింది. (‘పరిణీత’ చిత్రంలో విద్య, సైఫ్‌ అలీ పాత్రల పేర్లు). నువ్వు కూడా నా రియల్‌ లైఫ్‌ శేఖర్‌ అయిపోయావు (సినిమా తనలో సగభాగం అనేది విద్యా ఉద్దేశం). ఇంకో విషయం ఏంటంటే.. నా భర్త సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌ యూటీవీలో చేరిన తర్వాత పని చేసిన మొదటి చిత్రం ఇది. మా ఇద్దరి తొలి చిత్రం ‘పరిణీత’ కావడం విశేషం’’ అన్నారామె.

Advertisement
Advertisement