
అంతిమయాత్రలో శ్రీదేవి పార్థీవదేహం, భావోద్వేగానికి లోనైన హేమమాలిని (ఇన్సెట్లో)
సాక్షి, ముంబయి : బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని భావోద్వేగానికి లోనయ్యారు. హఠాన్మరణం చెందిన శ్రీదేవి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన ఆమె దాదాపు కంటతడి పెట్టుకున్నారు. 'మరణంలోనూ నిర్మలంగా ఎరుపు చీరలో చాలా అందంగా కనిపిస్తూ శ్రీదేవి పవళిస్తోంది' అంటూ హేమ భావోద్వేగంతో నిండిన ట్వీట్ చేశారు. శనివారం శ్రీదేవి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. తొలుత గుండెపోటుతో చనిపోయారని చెప్పినా.. బాత్ టబ్లో పడి ఆమె ఊపిరి ఆడక చనిపోయారని దుబాయ్ పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు, పబ్లిక్ ప్రాసీక్యూటర్స్ తేల్చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆమె అంతిమయాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కడసారి ఆమెను చూసేందుకు హేమమాలిని వచ్చారు. 'నా నివాళులు అర్పించాను. మొత్తం చిత్ర పరిశ్రమ అక్కడే శోకసంద్రంలో మునిగిపోయి ఉంది. అది ఆమెకు ఉన్న తేజస్సు.. ఆమె నటించిన చిత్రాల మ్యాజిక్.. ఎర్రచీరలో ఆమె చాలా అందంగా కనిపిస్తూ అక్కడ ప్రశాంతంగా పవళిస్తోంది. ఏర్పాట్లు అన్నీ చాలా బాగా చేశారు. గుడ్బై మై డియర్ ఫ్రెండ్' అని హేమమాలిని ట్వీట్ చేశారు.