మూడు పాత్రలతో...
చిత్ర పరిశ్రమలో స్క్రిప్ట్ డాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న కె.ఎల్.ప్రసాద్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘స్క్రీన్ ప్లే’. ‘ఆఫ్ ఏన్ ఇండియన్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. విక్రమ్ శివ, ప్రగతి యాదాటి జంటగా నటించిన ఈ చిత్రంలో కె.ఎల్.ప్రసాద్ ముఖ్య పాత్ర పోషించారు. బుజ్జి బుడుగు ఫిలిమ్స్ పతాకంపై డాక్టర్ అరుణకుమారి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ని ప్రసాద్స్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ విడుదల చేశారు.
‘‘కె.ఎల్.ప్రసాద్ తెలుగు సినిమాకు దొరికిన వజ్రం’’ అన్నారు రమేష్ ప్రసాద్, దర్శక–నిర్మాత నటుడు ఆర్. నారాయణమూర్తి. ‘‘సినిమా బాగుంది. అందరూ చూడాల్సిన చిత్రమిది’’ అన్నారు రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, జె.కె. భారవి. ‘‘మూడు పాత్రలతో రెండు గంటలు కట్టి పడేసే అద్భుతమైన చిత్రమిది. ఇందులో ఉన్న ఒకే పాట పది పాటలతో సమానం’’ అన్నారు చిత్ర సంగీత దర్శకురాలు శ్రీలేఖ. ‘‘పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ చిత్రం మన తెలుగు సినిమాకు గర్వకారణం’’ అన్నారు కె.ఎల్. ప్రసాద్. రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్, రచయిత విజయేంద్రప్రసాద్, విక్రమ్ శివ, ప్రగతి యాదాటి, డా. అరుణకుమారి పాల్గొన్నారు.