కనుల పండువగా సంతోషం

Santosham South Indian Film Awards 2019 In Hyderabad - Sakshi

‘సంతోషం’ సినీ వారపత్రిక 17వ వార్షికోత్సవం, ‘సంతోషం సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019’  ప్రదానోత్సవం హైదరాబాద్‌లో కనుల పండువగా జరిగింది. సురేష్‌ కొండేటి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో తారల ప్రసంగాలు, నృత్యాలు, సరదా స్కిట్‌లు హైలైట్‌గా నిలిచాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలకు చెందిన పలువురికి అవార్డులు అందించారు.65 సంవత్సరాలు సినీ జీవితం పూర్తయిన సందర్భంగా నటి జమున ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, డి. సురేశ్‌ బాబు ఈ అవార్డు అందించారు. ప్రముఖ ఫిల్మ్‌ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరికి ఫిల్మ్‌ జర్నలిజంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ‘మహానటి’కిగాను ఉత్తమ సపోర్టింగ్‌ ఆర్టిస్టు అవార్డును రాజేంద్రప్రసాద్, అదే చిత్రంలో చిన్నప్పటి సావిత్రిగా నటించిన సాయి తేజస్విని బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్టు అవార్డును అందుకున్నారు. సీనియర్‌ నటి ప్రభ లెజెండరీ యాక్ట్రెస్‌ అవార్డును, అల్లు రామలింగయ్య అవార్డును ‘వెన్నెల’ కిశోర్‌ అందుకున్నారు. డి. రామానాయుడు స్మారక అవార్డును నిర్మాత ‘దిల్‌’ రాజు అందుకున్నారు.

‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రానికి ఉత్తమ హాస్యనటునిగా సునీల్, ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రానికి బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాంకీ, పృథ్వీరాజ్‌ ఆత్మీయ పురస్కారం అందుకున్నారు. ‘రంగస్థలం’ చిత్రానికి ఉత్తమ దర్శకుడి అవార్డును సుకుమార్‌ సతీమణి తబిత అందుకున్నారు. బెస్ట్‌ డెబ్యూ హీరో అవార్డును విశ్వక్‌సేన్, ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రానికి కార్తికేయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. శ్రీదేవి స్మారక అవార్డును శ్రియ అందుకున్నారు. ‘అరవింద సమేత’ చిత్రానికి బెస్ట్‌ మ్యూజిక్‌ డెరైక్టర్‌ అవార్డును తమన్‌ అందుకున్నారు. వీరితో పాటు మరికొంత మందికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top