సాయిపల్లవి సినిమా పేరు మారింది..!

Sai Pallavi Tamil Karu Title Changed - Sakshi

తమిళసినిమా: కోలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్న చిత్రాల్లో కరు ఒకటి. కారణం నటి సాయిపల్లవి నటించిన తొలి తమిళ చిత్రం ఇదే కావడం. మలయాళంలో ప్రేమమ్‌ చిత్రంతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న నటి సాయిపల్లవి, ఆ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఫిదా, ఎంసీఏ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఇప్పుడు కరు చిత్రంతో తమిళప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో కోలీవుడ్‌లోనూ మ్యాజిక్‌ చేస్తుందో? లేదోనన్న ఆసక్తి నెలకొంది.

లైకా సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్‌ దర్శకుడు. టాలీవుడ్‌ యువ నటుడు నాగశౌర్య ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. మరో విశేషం ఏమిటంటే ఇందులో నటి సాయిపల్లవి ఒక పాపకు తల్లిగా నటించింది. తొలి చిత్రంలోనే తల్లి పాత్రతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ చిత్రంపై సాయిపల్లవి చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పాలి.

నటుడు నిళల్‌గళ్‌ రవి, రేఖ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని, నీరవ్‌షా ఛాయాగ్రహణం అందించారు. మరో విషయం ఏమిటంటే చిత్రం ఈ నెల 27న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇలాంటి సమయంలో చిత్రం పేరును దియా అని మార్చారు. ఇదే చిత్రం తెలుగులో కణం పేరుతో విడుదల కానుంది. ఇకపోతే నటి సాయిపల్లవి తాజాగా సూర్యకు జంటగా ఎన్‌జీకే, ధనుష్‌తో మారి–2 చిత్రాల్లో నటిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top