హీరోలు లేరు... విలన్లు లేరు!

Rangu Movie Pre Release Function - Sakshi

తనీష్‌

‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయ్యింది. నేను నటించిన తొలి సినిమా (బాలనటుడు) ‘ప్రేమంటే ఇదేరా’ హిట్‌ అయిన రోజు చాలా ఆనందమేసింది. చాలా ఏళ్ల తర్వాత ‘రంగు’ సినిమాతో మళ్లీ ఇంత ఆనందంగా ఉంది’’ అని తనీష్‌ అన్నారు. తనీష్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, షఫీ ముఖ్య తారలుగా కార్తికేయ.వి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగు’. నల్లస్వామి సమర్పణలో ఎ.పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో తనీష్‌ మాట్లాడుతూ– ‘‘చాలా రోజుల తర్వాత మా అమ్మగారు నా కోసం ఈ ఫంక్షన్‌కు వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో హీరోలు, విలన్లు లేరు.. అన్నీ పాత్రలే’’ అన్నారు. ‘‘ఓ ఫ్రెండ్‌ ద్వారా లారా గురించి విన్నాను. ఆయన స్నేహితులను కలిసి కథను తయారు చేసుకున్నాను. పరుచూరి బ్రదర్స్‌ ఈ కథని కమర్షియల్‌ ఫార్మాట్‌లోకి మార్చి అద్భుతంగా మలిచారు’’ అన్నారు కార్తికేయ.

‘‘ఓ కొత్త బ్యానర్‌ పెట్టుకుని కొత్తవారితో సినిమాలు చేయాలనుకుంటున్నాం. మా సినిమా వల్ల ఎవరికీ నష్టం రాదు.. రానివ్వను. నేను చాలా సినిమాలు తీస్తున్నాను. తక్కువ ఖర్చులో సినిమా ఎలా తీయాలో నేర్చుకున్నా. ‘రంగు’ సినిమా బాగుంటుంది’’ అని పద్మనాభరెడ్డి అన్నారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, పరుచూరి వెంకటేశ్వరరావు, ప్రియా సింగ్, నిర్మాతలు మల్కాపురం శివకుమార్, రవి, రామసత్యనారాయణ, రాజ్‌కందుకూరి తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top