నేను తప్పు చేశా! : రకుల్‌ | Sakshi
Sakshi News home page

నేను తప్పు చేశా!

Published Wed, Mar 4 2020 8:39 AM

Rakul Preet Singh Says She Did A Mistake - Sakshi

‘నేను తప్పు చేశాను. అది ఇప్పటికి తెలిసింది’ అని చెప్పుకొచ్చింది నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌. ఏదైనా అనుభవంలోకి వచ్చే వరకూ తెలియదంటారు. రకుల్‌ప్రీత్‌సింగ్‌ పరిస్థితి అంతే. కోలీవుడ్‌లో తొలుత ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది చిన్నది ఈ బ్యూటీ. ఇక్కడ ఒకటి రెండు చిత్రాల్లో నటించినా కోలీవుడ్‌ పట్టించుకోలేదు. దీంతో లాభం లేదనుకుని టాలీవుడ్‌కు మకాం మార్చింది. లక్కీగా అక్కడ అదృష్టం కలిసొచ్చింది. రకుల్‌ప్రీత్‌సింగ్‌కు అవకాశాలు వచ్చాయి. తెలుగు ప్రేక్షకులను తన అందాలతో ఖుషీ పరిచింది. దీంతో స్టార్‌ ఇమేజ్‌ వచ్చేసింది. యువ స్టార్‌ హీరోలందరితోనూ జత కట్టేసింది. ఇదంతా చకచకా జరిగిపోయింది. వెనుదిరిగి చూస్తే ఇప్పుడు అవకాశాలు ముఖం చాటేస్తున్నాయి.

లక్కీగా తమిళంలోనే రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా ఇండియన్‌–2 చిత్రంలో నటిస్తోంది. మరో చిత్రాన్ని శివకార్తికేయన్‌తో చేస్తోంది. ఇకపోతే తెలుగులో చాలా గ్యాప్‌ తరువాత ఒక చిత్రంలో నటిస్తోంది. నటిగా తన కెరీర్‌ను పునఃపరిశీలించుకున్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అవకాశాలు అడుగంటడానికి కారణాలను విశ్లేసించుకున్నట్టుంది. దీని గురించి ఈ అమ్మడు తెలుపుతూ తాను వరుసగా  అందాలారబోతకే ప్రాధాన్యతనిచ్చానని, అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమైందని అంది. తాను ఏ దర్శక, నిర్మాతకు సమస్యలు తెచ్చి పెట్టలేదని, పారితోషికం విషయంలో కూడా పట్టు విడుపు పాటించానని చెప్పింది. (మళ్లీ జోడీ కట్టనున్న రకుల్‌)

ఎవరితోనూ గొడవ పడలేదంది. షూటింగ్‌లకు టైమ్‌కు వెళ్లేదాన్నని చెప్పింది.అయినా అవకాశాలు తగ్గిపోయాయంటే అందుకు కారణం తాను గ్లామరస్‌గా నటించడమేనని పేర్కొంది. నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంపిక చేసుకోకుండా కేవలం గ్లామర్‌కే పరిమితం అయ్యానని, ఫలితం అవకాశాలు దూరం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం వస్తుంది అన్నది ఈ అమ్మడికి తెలియదనుకుంటా. అయితే ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్‌ శాఖాహారానికి మారిందట. దీని గురించి తను తెలుపుతూ తానిప్పుడు శాఖాకారిగా మారానని, దాన్ని పాటిస్తున్నానని చెప్పింది.

ముంబయిలో షూటింగ్‌ అయితే భోజనం ఇంటి నుంచే వస్తుందని చెప్పింది. శాఖాహారమే తింటానని చెప్పింది. పళ్లు, పళ్లరసం ఎక్కువగా తీసుకుంటానని చెప్పింది. ఇండియాలో ఎక్కడైనా శాఖాహారం లభిస్తుందని, విదేశాలకు వెళ్లినప్పుడే అది రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పింది. అయితే తన యూనిట్‌లో ఎవరికైనా శాఖాహారం దొరికితే వాళ్లు తనకు ఇచ్చి ఆకలి తీరుస్తారని రకుల్‌ప్రీత్‌సింగ్‌  చెప్పుకొచ్చింది. కాగా లక్కీగా ఇండియన్‌–2 చిత్రం షూటింగ్‌లో ప్రమాదం జరిగిన సమయంలో ఈ అమ్మడు లేదు. లేకపోతే క్రైంబ్రాంచ్‌ పోలీసుల విచారణను ఈ జాణ కూడా ఎదుర్కోవలసి ఉండేది.

Advertisement
Advertisement