వైభవంగా ‘2.0’ టీజర్‌ లాంచ్‌

Rajinikanth's 2.0 teaser launch - Sakshi

అభిమానుల సమక్షంలో వేడుక

‘నాన్‌ ఎప్పో వరువేన్, ఎప్పిడి వరువేన్ను యారుక్కుమ్‌ తెరియాదు. ఆనా వరవేండియ నేరత్తుల వరువేన్‌’. ‘నాన్‌ లేట్టా వందాలుమ్‌ లేటెస్టా వరువేన్‌’...

రజనీకాంత్‌ చెప్పిన పాపులర్‌ డైలాగ్స్‌లో ఈ రెండూ కూడా ఉన్నాయి. మొదటిది ‘ముత్తు’ సినిమాలోది. రెండోది ‘బాబా’లో చెప్పిన డైలాగ్‌. ఈ రెండు డైలాగ్స్‌ని రజనీకాంత్‌ తాజా చిత్రం ‘2.0’కి కనెక్ట్‌ చేయొచ్చు. ‘నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో ఎవరికీ తెలియదు. కానీ రావాల్సినప్పుడు వస్తా’ అన్నది ఫస్ట్‌ డైలాగ్‌ అర్థం. ‘నేను లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తా’ అన్నది రెండో డైలాగ్‌ అర్థం. ఇప్పటికి రెండు మూడు సార్లు వాయిదా పడిన ‘2.0’ లేటెస్ట్‌గా రావడం ఖాయమని, రావాల్సిన టైమ్‌ (సమ్మర్‌ హాలిడేస్‌)కే వస్తుందని అభిమానులు అంటున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోన్న ‘2.0’ గ్రాఫిక్స్‌ వర్క్‌ ప్రస్తుతం లాస్‌ ఏంజిల్స్‌లో జరుగుతోంది. ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను దుబాయ్‌లో విడుదల చేశారు.

టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘టీజర్‌ రిలీజ్‌ ఫంక్షన్‌ను భారీగా ప్లాన్‌ చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల అభిమానుల సమక్షంలో ఫంక్షన్‌ చేయాలనుకుంటున్నాం. అందుకు తగ్గ వేదిక కోసం చూస్తున్నాం’’ అని ‘2.0’ టీమ్‌ ప్రతినిధి పేర్కొన్నారు. సెక్యూరిటీ, వేదిక అన్నీ కరెక్ట్‌గా కుదిరితే అభిమానుల మధ్యలో ఫంక్షన్‌ చేయడం పక్కా. ఫిబ్రవరిలో లేదా మార్చిలో ఈ వేడుక ఉంటుంది. హైదరాబాద్‌లో టీజర్‌ రిలీజ్‌ చేసిన 30 రోజులకు చెన్నైలో ట్రైలర్‌ రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఏప్రిల్‌ 27న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారని వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఆ నెలలోనే రావడానికి ముమ్మరంగా పనులు చేయిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top