నేను అదృష్టవంతురాలినే!

Pooja Hegde Comment On Kollywood Films - Sakshi

మన జీవితాన్ని విధి నిర్ణయించేస్తుందని నటి పూజాహెగ్డే అంటోంది. ముఖముడి చిత్రం ద్వారా హీరోయిన్‌గా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ ఉత్తరాది బ్యూటీ ఆ తరువాత కోలీవుడ్‌లో కనిపించలేదు. బహుశా ఆ చిత్రం విజయం సాధిస్తే ఏమన్నా అవకాశాలు వచ్చేవేమో.. కానీ అలా జరగలేదు. అయితే టాలీవుడ్‌ మాత్రం ఈ అమ్మడిని బాగానే రిసీవ్‌ చేసుకుంది. ముకుంద, దువ్వాడ జగన్నాథమ్‌ వంటి చిత్రాలు పూజాహెగ్డేకు మంచి పేరే తెచ్చి పెట్టాయి. 

జూనియర్‌ ఎన్‌టీఆర్‌తో నటించిన అరవింద సమేత వీరరాఘవ చిత్రం కూడా హిట్‌ అనిపించుకోవడంతో అమ్మడిది లక్కీహ్యాండేనని టాక్‌ ఉంది. అలాగే చాలా మంది స్టార్‌ హీరోయిన్ల మాదిరిగానే రంగస్థలం చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌కు ఆడేసింది. అదీ బాగానే వర్కౌట్‌ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజాహెగ్డే వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. మహేశ్‌బాబుతో మహర్షి చిత్రంలో నటిస్తోంది.

సాధారణంగా టాలీవుడ్‌లో సక్సెస్‌ అయితే కోలీవుడ్‌ నుంచి కాలింగ్‌ రావాలి. కానీ పూజాహెగ్డే విషయంలో ఇంకా అలా జరగలేదు. అంతే కాదు ఈ అమ్మడు నటిగా ఎంట్రీ ఇచ్చి ఏడేళ్లవుతున్నా, ఇప్పుటికి 8 చిత్రాలే చేసింది. ప్రస్తుతం హిందీలోనూ ఒక చిత్రం చేస్తోంది. గ్లామర్‌ విషయంలో హద్దులుగానీ, షరతులు గానీ విధించని పూజాహెగ్డే కెరీర్‌ ఇంకా జోరు అందుకోవలసి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుందో ఏమో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమ్మడు కాస్త విరక్తితో కూడిన వేదాంత ధోరణిలో తనేంటో తనకు తెలుసు అన్నట్టుగా మాట్లాడింది. 

విధి గురించో, ఇతర విషయాల గురించో నాకు పెద్దగా తెలియదు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించలేను. ఒక చిత్రంలో నటించడానికి అంగీకరించినప్పుడు అందులో పాత్ర కోసం ఏమేం చేయాలన్నదంతా దర్శకుడు ముందుగానే డిజైన్‌ చేసి ఉంటారు. దాన్ని నమ్మశక్యంగా నటించాలంతే. ఈ లోకంలో జన్మించిన నేను ఏం చేయాలన్నది కూడా విధి నిర్ణయించేసి ఉంటుంది. దాన్ని చేస్తున్నాను. పెద్ద విజయమో, చిన్న విజయమో, లేక అపజయమో మనలో చాలా మార్పు తీసుకొస్తుంది. చాలా అనుభవాలను అందిస్తుంది. అందులోంచి పాఠం నేర్చుకుని మనం ఏంటో అర్థం చేసుకోగలం. అయితే ఏదేమైన నేను అదృష్టవంతురాలిననే చెప్పాలి అని పూజాహెగ్డే పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top