సవతి కొడుకు గురించి హేమ మాలిని

Hema Malini about Sunny Deol

సాక్షి, సినిమా : బాలీవుడ్ లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలియని వారుండరేమో. మొదటి భార్య ప్రకాశ్ కౌర్ ఉండగానే నటి హేమ మాలినిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే మతం మారి మరి ఆయన హేమను వివాహం చేసుకున్నారంటూ అప్పట్లో ఆయనపై విమర్శలు వెలువెత్తాయి. అదంతా ట్రాష్‌ అంటూ వాటిని ధర్మేంద్ర ఖండించారు కూడా. ఇదిలా ఉంటే మొదటి భార్య కుమారులైన సన్నీ, బాబీ డియోల్‌లు.. హేమ మాలిని-ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ కనిపించరు. అసలు వీరు కలవటం అనేది కూడా చాలా అరుదనే చెప్పుకోవాలి. కానీ, గ్యాప్‌ గురించి బాలీవుడ్‌లో కథలు కథలుగా చెప్పుకుంటుంటారు కూడా.

అయితే ఫస్ట్‌ టైమ్‌ ధర్మేంద్ర మొదటి భార్య పిల్లల గురించి హేమ మాలిని ఓపెన్‌ అయ్యారు. వారితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆమె స్వయంగా చెప్పారు. ప్రముఖ రచయిత రాజ్‌ కమల్‌ ముఖర్జీ రచించిన ఆమె ఆత్మకథ హేమా మాలిని : బియాండ్ ది డ్రీమ్‌ గర్ల్ పుసక్త ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘మా మధ్య బంధం ఎంతో అందమైంది. ముఖ్యంగా నాకు ఎప్పుడు ఏం సాయం కావాలన్న ధర్మేంద్రతోపాటు సన్నీ కూడా ముందుంటాడు’’ అని ఆమె చెప్పారు. 2005లో రాజస్థాన్‌లో ఆమెకు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హేమను ముందుగా పరామర్శించటంతోపాటు.. తోడుగా సన్నీ డియోల్‌ నిలిచాడంట. ఆమె వెంటే ఉండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకున్నాడని ఆమె చెప్పారు.

ఇక ఈ పుస్తకావిష్కరణ సభకు సన్నీడియోల్‌ రాకపోయినప్పటికీ.. రమేష్‌ సిప్పీ, జూహి చావ్లా,సుభాష్‌ ఘాయ్‌, నటి దీపికా పదుకునే, మాలిని కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top