నా గురించి అసత్య ప్రచారం: రష్మిక | Actress Rashmika Mandanna Has Expressed That She Is Spreading Lies About Me | Sakshi
Sakshi News home page

నా గురించి అసత్య ప్రచారం చేస్తున్నారు: రష్మిక

Jan 19 2020 7:37 AM | Updated on Jan 19 2020 2:18 PM

Actress Rashmika Mandanna Has Expressed That She Is Spreading Lies About Me - Sakshi

నా గురించి అసత్య ప్రచారం చేస్తున్నారు అని నటి రష్మికమందన్న ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కన్నడ భామ ఇప్పుడు దక్షిణాదిలో క్రేజీ కథానాయకిగా వెలిగిపోతోంది. మొదట మాతృభాషలో నటిగా పరిచయమై ఆ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమకు దిగుమతి అయ్యింది. అక్కడ గీతగోవిందం చిత్రం అనూహ్య విజయాన్ని అందుకుని రష్మికను పాపులర్‌ చేసింది. అంతే ఆ తరువాత ఆమె క్రేజ్‌ తమిళచిత్ర పరిశ్రమకు పాకింది. ఇక్కడ ఇళయదళపతితో నటించనుందనే వదంతులు జోరుగా సాగాయి. అలాంటిది ఇప్పుడు కార్తీకి జంటగా సుల్తాన్‌ చిత్రంతో నేరుగా ఎంట్రీ ఇస్తోంది. అంటే అంతకు ముందు విజయ్‌దేవరకొండకు జంటగా నటించిన డియర్‌ కామ్రేడ్‌ చిత్రం అదే పేరుతో అనువాదమైంది. కాగా ప్రస్తుతం తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ లిస్ట్‌లో చేరిపోయింది.

చదవండి: రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు

అక్కడ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో జత కట్టిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి సందర్భంగా తెరపైకి వచ్చి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా మరో స్టార్‌ హీరో అల్లుఅర్జున్‌తో రొమాన్స్‌ చేయడానికి సిద్ధం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయపన్ను శాఖ రష్మికకు షాక్‌ ఇచ్చింది. ఇటీవల కర్ణాటక రాష్ట్రం, కుడకు జిల్లాలోని కుక్కులూరు గ్రామంలోని ఆమె ఇల్లు, కల్యాణమంటపంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో నటి రష్మిక మందన్నా షూటింగ్‌ నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంది. కాగా సోదాల్లో రష్మికకు సొంత కల్యాణ మంటపంతో పాటు ప్రకటనల కంపెనీ, ఇతర వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం ఉన్నట్టు తెలిసింది. అంతే కాకుండా రష్మిక తండ్రి మదన్‌ మంజన్నా, తల్లి సుమన్‌ల పేరుతో గత ఒక్క ఏడాదిలోనే కోట్లాది రూపాయలు విలువైన సొత్తు జమ అయిన విషయం వెలుగు చూసింది. కాగా ఆదాయపన్ను శాఖ అధికారులు వాటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం.

చదవండి: రష్మిక ఇంటి నుంచి రూ.25 లక్షలు స్వాధీనం

అంతే కాకుండా విచారణ కోసం బెంగళూరులోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి హాజరు కావలసిందిగా నటి రష్మికను, ఆమె తల్లిదండ్రులను ఆదేశించినట్లు సమాచారం. కాగా ఈ సోదాల గురించి నటి రష్మిక మేనేజర్‌ స్పందించారు. రష్మికకు సంబంధించిన ఆదాయానికి సంబంధించిన వ్యవహారాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. ఆమె ఆదాయానికి సంబంధించి పన్ను చెల్లింపులు అన్నీ సక్రమంగానే ఉన్నాయని, అయితే ఆదాయపన్ను శాఖ అధికారులు రషి్మక తండ్రికి సంబంధించిన వ్యాపారాలు, ఆస్తులపై సోదాలు నిర్వహించినట్లు వివరించారు. కాగా నటి రష్మిక తన ఇంటిలో జరిగిన ఐటీ సోదాలపై రియాక్షన్‌ మరోలా ఉంది. తాను అధిక పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోందని, నిజానికి తాను భారీ బడ్జెట్‌ చిత్రాల్లో నటించే స్థాయికి ఇంకా ఎదగలేదని పేర్కొంది. కాగా సోదాల వ్యవహారంలో ఆదాయపన్ను శాఖపై చట్టపరంగానే ఎదుర్కొంటానని రషి్మక పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement