ట్విట్టర్‌పై అమెరికా కోర్టులో కేసు | Twitter Accused in Widow Suit of Allowing Islamic State Use | Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌పై అమెరికా కోర్టులో కేసు

Jan 14 2016 6:27 PM | Updated on Sep 3 2017 3:41 PM

ట్విట్టర్‌పై అమెరికా కోర్టులో కేసు

ట్విట్టర్‌పై అమెరికా కోర్టులో కేసు

ఐసిస్ టెర్రరిస్టుల ప్రచారాన్ని ‘ట్విట్టర్’ ఉద్దేశపూర్వకంగా అనుమతిస్తోందని ఆరోపిస్తూ ఐసిస్ కాల్పుల్లో మరణించిన ఫ్లోరిడా డిఫెన్స్ కాంట్రాక్టర్ లియాడ్ కార్ల్ ఫీల్డ్స్ జూనియర్ కుటుంబ సభ్యులు బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు.

శాన్‌ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియాలో ఐసిస్ టెర్రరిస్టుల ప్రచారాన్ని ‘ట్విట్టర్’ ఉద్దేశపూర్వకంగా అనుమతిస్తోందని ఆరోపిస్తూ ఐసిస్ కాల్పుల్లో మరణించిన ఫ్లోరిడా డిఫెన్స్ కాంట్రాక్టర్ లియాడ్ కార్ల్ ఫీల్డ్స్ జూనియర్ కుటుంబ సభ్యులు బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు. అమెరికా ప్రభుత్వ నిధులతో నడుస్తున్న అమ్మాన్‌లోని అంతర్జాతీయ పోలీసు శిక్షణా కేంద్రంలో గత నవంబర్‌లో జోర్డాన్ భద్రతా దళాలను శిక్షణ ఇస్తున్న సందర్భంగా టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో లియాడ్‌తోపాటు మరో డిఫెన్స్ కాంట్రాక్టర్ మరణించారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ ఐసిస్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి కూడా.

తీవ్రవాదుల భావాజాలాన్ని ప్రచారం చేయడానికి, ఆన్‌లైన్‌లో నిధులు సేకరించేందుకు, కొత్త నియామకాలను జరుపుకునేందుకు కొన్నేళ్లుగా ఐసిస్ టైస్టులు ‘ట్విట్టర్’ ఖాతాలను ఉపయోగించుకుంటున్నాయని, ఇది తెలిసినా ట్విట్టర్ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా ఆ ఖాతాలను అనుమతిస్తోందని కేసు అభియోగాల్లో అరోపించారు. ట్విట్టర్‌లో ఐసిస్ టెర్రరిస్టులకు దాదాపు 70 వేల ఖాతాలు ఉన్నాయని, వాటిలో 79 ఖాతాలు అధికారికంగా ఉన్నాయని, ప్రతి నిమిషానికి 90 ట్వీట్లను టెర్రరిస్టులు పోస్ట్ చేస్తున్నారని దావాలో పేర్కొన్నారు. ట్విట్టర్ ఆ ఖాతాలను అనుమతించక పోయినట్లయితే నేడు ఐసిస్ ప్రపంచవ్యాప్తంగా ఇంతగా విస్తరించేది కాదని దావాలో పిటిషనర్ వాదించారు.

ఈ ఆరోపణల్లో నిజం లేదంటూ ట్విట్టర్ యాజమాన్యం స్పందించింది. ‘లియాడ్ కుటుంబానికి జరిగిన అపార నష్టాన్ని మేము అర్థం చేసుకోగలం. ప్రపంచ ప్రజలలాగే మేము బాధ పడుతున్నాం. టెర్రరిస్టు గ్రూపుల సాగిస్తున్న హింసాకాండకు మేమూ భీతిల్లుతున్నాం. టెర్రరిజం ప్రచారానికి, హింసాత్మక బెదిరింపులకు మిగతా సోషల్ మీడియాలాగే ట్విట్టర్‌లో కూడా చోటులేదు. ఈ విషయాన్ని మా నిబంధనలే స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేందుకు మా టీమ్‌లు ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్నాయి. ప్రభుత్వ శాంతిభద్రతా సంస్థలకు కూడా ఈ విషయంలో సహకరిస్తున్నాం. మా మీద ఇలాంటి కేసు దాఖలు చేయడం ఇదే మొదటి సారి’ అని ట్విట్టర్ యాజమాన్యం వ్యాఖ్యానించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement