నాలుక్కరుచుకున్న ప్రభుత్వం.. భారీ పరిహారం!
న్యూజీలాండ్ ప్రభుత్వం తాము చేసిన తప్పిదానికి నాలుక్కరుచుకుంది. ఓ వ్యక్తి విషయంలో పొరబడి అతడిని రెండు దశాబ్దాలకు పైగా జైలులో ఉంచినందుకు భారీగా పరిహారం చెల్లించనుంది.
వెల్లింగ్టన్: న్యూజీలాండ్ ప్రభుత్వం తాము చేసిన తప్పిదానికి నాలుక్కరుచుకుంది. ఓ వ్యక్తి విషయంలో పొరబడి అతడిని రెండు దశాబ్దాలకు పైగా జైలులో ఉంచినందుకు భారీగా పరిహారం చెల్లించనుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. టీనా పోరా అనే వ్యక్తిని అత్యాచారం, హత్య కేసులో అరెస్ట్ చేశారు. సుసాన్ బర్డెట్ అనే ఆక్లాండ్ కు చెందిన మహిళపై ఈ దురాఘతానికి పాల్పడ్డాడని 1994లో అతడిని దోషిగా తేల్చారు. అయితే దాదాపు రెండు దశాబ్దాల జైలు జీవితం గడిపిన తర్వాత బాధితుడు పోరా 2015లో మళ్లీ అప్పీల్ చేసుకున్నాడు.
నిజానికి హత్య జరిగినప్పుడు పోరా వయసు కేవలం 16 ఏళ్లు. సుసాన్ బర్డెట్ అత్యాచారంతో పాటు హత్యకు గురైంది. సంఘటన స్థలంలో పోరా కనిపించడంతో అతడే ఈ దారుణానికి పాల్పడ్డాడని భావించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. రేపిస్ట్ మాల్కమ్ రీవా ఈ నేరానికి పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. అయితే బర్డెట్ ను అతడు రేప్ చేశాడని 1999లో డీఎన్ఏ టెస్టుల్లో తేలింది. కానీ, కేసు విచారణ రెండు సార్లు వాయిదా పడింది. చివరగా ప్రస్తుత విచారణలో పోరా అమాయకుడని, ఈ నేరం అతడు చేయలేదని న్యూజీలాండ్ ప్రభుత్వం గ్రహించింది.
దీంతో అతడికి క్షమాపణ చెప్పడంతో పాటు 1.8 మిలియన్ అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.12 కోట్లు) ఇవ్వడానికి అంగీకరించింది. తన క్లయింట్ కు భారీ పరిహారం అందుతుందని భావించినట్లు పోరా తరఫు న్యాయవాది మీడియాకు తెలిపారు. కేసు విచారణ రెండు దశాబ్దాలకు పైగా కొనసాగడంతో టీనా పోరా జైలులో ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చిందని అతడి బంధువులు, సన్నిహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


