ఇంటర్‌పోల్‌ కన్నుగప్పి నీరవ్‌ రాకపోకలు | Nirav Modi managed to travel across several countries despite Interpol | Sakshi
Sakshi News home page

ఇంటర్‌పోల్‌ కన్నుగప్పి నీరవ్‌ రాకపోకలు

Jun 19 2018 3:27 AM | Updated on Jun 19 2018 3:27 AM

Nirav Modi managed to travel across several countries despite Interpol - Sakshi

న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ పాస్‌పోర్టును రద్దు చేసినట్లు ఇంటర్‌పోల్‌ ద్వారా సమాచారం ఇచ్చాక కూడా అతను వివిధ దేశాల మధ్య రాకపోకలు సాగించాడని సీబీఐ వెల్లడించింది. పాస్‌పోర్టు రద్దు విషయాన్ని ఇంటర్‌పోల్‌ డిఫ్యూజన్‌ నోటీసు జారీ ద్వారా ఫిబ్రవరి 15న సభ్య దేశాలతో పంచుకున్నామని సీబీఐ ప్రతినిధి అభిషేక్‌ దయాల్‌ చెప్పారు. ఆ విషయం ఇంటర్‌పోల్‌ కేంద్రీకృత సమాచార కేంద్రంలో నమోదైనప్పటికీ అతను యథేచ్ఛగా పర్యటనలు కొనసాగించాడన్నారు. ‘విదేశాంగ శాఖ నీరవ్‌ పాస్‌పోర్టును రద్దు చేశాక.. డిఫ్యూజన్‌ నోటీసు ద్వారా ఆ సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకున్నాం.

పాస్‌పోర్టును రద్దు చేసిన సమాచారం ఇంటర్‌పోల్‌ సమాచార కేంద్రంలో ఫిబ్రవరి 24 నుంచి అన్ని సభ్య దేశాలకు అందుబాటులో ఉంది’ అని దయాల్‌ వెల్లడించారు. నీరవ్‌కు భారత ప్రభుత్వం జారీచేసిన ఐదు పాస్‌పోర్టుల పూర్తి వివరాల్ని ఇంటర్‌పోల్‌కు తెలియచేశామన్నారు. ఇటీవల బ్రిటన్‌ ప్రభుత్వం భారత్‌తో పంచు కున్న సమాచారం.. నీరవ్‌ మార్చి 15న లండన్‌ హీత్రూ విమానాశ్రయం నుంచి హాంకాంగ్‌కు, మార్చి 28న న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు, మార్చి 31న లండన్‌ నుంచి పారిస్‌కు ప్రయాణం చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం నీరవ్‌ ఎక్కడున్నారో అన్న దానిపై విశ్వసనీయ సమాచారం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement