
‘అణు’ నియంత్రణకు ఇరాన్ ఓకే!
తమ దేశంలో అణు కార్యక్రమాన్ని నియంత్రించుకునే దిశగా ఇరాన్ అగ్రరాజ్యాలతో ఆదివారం ఓ చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది.
అగ్రరాజ్యాలతో కీలక ఒప్పందం
ఐరాస, ఈయూ, భారత్ హర్షం
చారిత్రక తప్పిదం: ఇజ్రాయెల్
వాషింగ్టన్/జెనీవా: తమ దేశంలో అణు కార్యక్రమాన్ని నియంత్రించుకునే దిశగా ఇరాన్ అగ్రరాజ్యాలతో ఆదివారం ఓ చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు ప్రతిగా పీ5 (ఐక్యరాజ్యసమితిలోని ఐదు శాశ్వత (పర్మినెంట్-పీ) సభ్య దేశాలు ఇరాన్పై విధించిన ఆంక్షలు కొన్నింటిని సడలించేలా అంగీకారం కుదిరింది. వివాదాస్పద అంశంపై ఓ ముస్లిం దేశం, పశ్చిమ దేశాల మధ్య సాధించిన అత్యంత ప్రధానమైన, స్పష్టమైన పురోగతిగా దీనిని భావిస్తున్నారు. ఐరాస, భారత్ సహా పలు దేశాలు ఈ ఒప్పందాన్ని స్వాగతించాయి. నాలుగురోజుల పాటు విస్తృతంగా సాగిం చిన చర్చలకు ముగింపు పలుకుతూ పీ5+1 గ్రూపు దేశాలైన అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్+జర్మనీ దేశాల ప్రతినిధులు ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై దౌత్యం నెరపేందుకు ఈ దేశాలు గ్రూపుగా ఏర్పడ్డాయి.
కాగా జెనీవాలో జరిగిన ఈ ఒప్పందం గురించి ఐరోపా యూనియన్ (ఈయూ) విదేశీ విధాన అధినేత కేథరిన్ ఆష్టన్ ప్రకటన చేశారు. ఈ ఒప్పందం మేరకు ఇరాన్ ఇకపై తన అణు కార్యక్రమాల పరిశీలనకు వచ్చేవారికి సహకరిస్తుంది. అంతేకాదు యురేనియం శుద్ధికి సంబంధించిన కొన్ని పనుల్ని నిలిపివేస్తుంది. యురేనియంను 5 శాతానికి మించి శుద్ధి చేయదు. 5 శాతానికి మిం చి శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గిస్తుంది. యురేనియంను 5 శాతానికి మిం చి శుద్ధి చేస్తే దానిని ఆయుధ పరిశోధనల నిమిత్తం వినియోగించవచ్చు. మరోవైపు పీ5+1 దేశాలు ఇరాన్ అణు కార్యక్రమం నేపథ్యంలో విధించిన ఆంక్షలను ఆరు నెలల పాటు ఎత్తివేస్తాయి. ఈ మేరకు ఇరాన్కు విలువైన ఖనిజాలతో పాటు వివిధరంగాలపై సుమారు రూ.40 వేల కోట్ల విలువైన ఆంక్షల సడలింపు లభిస్తుంది.
కీలకమైన తొలి అడుగు: ఒబామా
ప్రాథమిక ఆరు నెలల అవగాహనగా భావిస్తున్న ఈ ఒప్పందంలో.. ఇరాన్ అణ్వాయుధం తయారు చేయకుండా నిరోధించేందుకు తగిన పరిమితులు కూడా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. ఈ రోజు అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి.. ఇరాన్ అణు కార్యక్రమాలపై తమ ఆందోళనలకు పరిష్కారం చూపే దిశగా ఓ కీలకమైన తొలి అడుగు వేసిందని టీవీలో జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన పేర్కొన్నారు.
యురేనియంను శుద్ధి చేయగలిగిన ఇరాన్ సామర్ధ్యానికి ఈ ఒప్పందం అడ్డుకట్ట వేస్తుందని చెప్పారు. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. దేశంలో యురేనియంను శుద్ధి చేసే ఇరాన్ హక్కును ఈ ఒప్పందం ద్వారా అగ్రరాజ్యాలు అంగీకరించినట్టయిందన్నారు. అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ కోరుకున్నది ఇచ్చి.. ఆ దేశ అణు కార్యక్రమాన్ని మాత్రం కొనసాగింపజేసే చెడ్డ ఒప్పందంగా దీనిని అభివర్ణించింది. జెనీవాలో జరిగింది చారిత్రక ఒప్పందం కాదని, చారిత్రక తప్పిదమని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు.
స్వాగతించిన ఐరాస, భారత్: ఐరాస, ఐరోపా యూనియన్తో పాటు భారత్, చైనా, రష్యా, బ్రిటన్, సిరియా, ఇరాక్ తదితర దేశాలు ఈ ఒప్పందాన్ని స్వాగతించాయి. పరస్పర విశ్వాసాన్ని పెంపొందించేందుకు, చర్చల కొనసాగింపును అనుమతించే దిశగా.. ఈ స్ఫూర్తిమంతమైన ప్రారంభాన్ని సద్వినియోగం చేసుకుని సాధ్యమైనవన్నీ చేయాలని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఇరాన్తో పాటు పీ5 దేశాలను కోరారు. చర్చలు, దౌత్యప్రక్రియ ద్వారా ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన సమస్యల పరిష్కారంపై ఒప్పందం కుదరడాన్ని స్వాగతిస్తున్నట్టు భారత్ తెలిపింది.
భారత్కు ఒరిగేదేమీ లేదు!
వాషింగ్టన్: అణు కార్యక్రమాలపై ఇరాన్ అంతర్జాతీయ దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నా దాంతో భారత్లాంటి దేశాలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఇరాన్ నుంచి చమురు దిగుమతులు తగ్గించుకోవాలన్న నిబంధన యథాతథంగా కొనసాగ నుంది. అంటే ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ లాంటి దేశాలు ఎప్పట్లాగే తగ్గించుకోవాల్సి ఉంటుంది. చమురు, ఆర్థిక, బ్యాంకింగ్ అంశాల్లో ఇరాన్పై ఆంక్షలు సాగుతాయని అమెరికా తన వాస్తవ పత్రంలో స్పష్టంగా పేర్కొంది. ఇరాన్పై ఆంక్షల వల్ల 2012-13 సంవత్సరంలో భారత్ ఆ దేశం నుంచి చమురు దిగుమతులను 26.5 శాతం తగ్గించుకుంది. కేవలం 13.3 మిలియన్ టన్నుల ముడి చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది.అంతకుముందు ఏడాది 18.1 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇరాన్పై ఉన్న ఆంక్షల వల్ల ఇలా దిగుమతుల్లో కోత విధించుకోవాల్సి వస్తోంది. భారత్కు అత్యధికంగా చమురు ఎగుమతి చే సే దేశాల్లో గతంలో రెండోస్థానంలో ఉన్న ఇరాన్ ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయింది.