‘ఆమె భవిష్యత్తును చూడలేడు’ | Sakshi
Sakshi News home page

నలుగురు పోలీసులకు శిక్ష పడాలి: జార్జ్‌ భార్య

Published Wed, Jun 3 2020 1:10 PM

George Floyd Wife Said He Will Never See Her Grow Up - Sakshi

వాషింగ్టన్‌: జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని ఫోర్జరీ కేసులో అరెస్ట్‌ చేసిన అమెరికా పోలీసులు.. అతడిని చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే.  జార్జ్‌ మరణం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచి వేస్తోంది. అతడి కుమార్తె ఆరేళ్ల జియానా ‘నా తండ్రి చాలా మంచివాడు. పోలీసు అధికారుల కర్కశత్వానికి బలయ్యాడు.. పేవ్‌మెంట్ మీద ప్రాణాలు విడిచాడు. పోలీసులు నాకు తండ్రిని దూరం చేశారు’ అంటూ విలపిస్తోంది. జార్జ్‌ భార్య వాషింగ్టన్‌ ‘వారు ఇంటికి వెళ్లి వారి కుటుంబాలతో కలిసి ఉంటారు. కానీ నా బిడ్డ జియానాకు తండ్రి లేడు. ఆమె ఎదుగుదలను.. ఉన్నత విద్యను అతడు చూడలేడు.. ఇక అతడు ఎన్నటికి ఆమెతో కలిసి నడవలేడు’ అంటూ కుమార్తె జియానాను గుండెలకు హత్తుకున్నారు. అంతేకాక ఫ్లాయిడ్ మరణంతో సంబంధం ఉన్న నలుగురు అధికారులను శిక్షించాలని.. అప్పుడే తనకు న్యాయం జరుగుతుందని వాషింగ్టన్ తెలిపారు.(భర్తతో తెగదెంపులు: పేరు తొలగించండి)

జార్జ్‌ చనిపోయిన విషయం తెలిసిన వెంటనే వాషింగ్టన్‌ మొదట తన బిడ్డను తల్చుకున్నారు. ‘జార్జ్‌ జియానాను ఎంతో ప్రేమించాడు’ అని తెలిపారు. ‘నేను నా బిడ్డ కోసం ఇక్కడ ఉన్నాను. నేను జార్జ్ కోసం ఇక్కడ ఉన్నాను. నేను అతనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. తను చాలా మంచివాడు అందుకే నేను అతనికి న్యాయం చేయాలనుకుంటున్నాను. ఎవరు ఏమనుకున్నా, అతను చాలా మంచివాడు’ అన్నారు. 

ఈ ఘటన అమెరికాలో తీవ్ర నిరసనలకు కారణమైంది. తొలుత మిన్నియాపోలిస్ నగరంలో కొంతమంది యువకులతో మొదలైన ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి.. జార్జ్‌ను కొట్టిచంపిన పోలీసులను విధులనుంచి తొలగించినా.. ఆగ్రహ జ్వాలలు మాత్రం ఆరలేదు. నలుగురు పోలీసులను ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తన ప్రజానీకం ఆందోళన బాటపడ్డారు. ట్రంప్‌ సైన్యాన్ని దించుతానంటూ హెచ్చరికలు జారీ చేశాడు.

Advertisement
Advertisement