అరె.. స్పెడర్‌ మ్యాన్‌ను మించిపోయాడుగా

French Man Climbs 475 Foot Tower In Just 25 Minutes In Barcelona - Sakshi

బార్సీలోనా : బార్సీలోనా నగరంలో ఒక వ్యక్తి అచ్చం స్పైడర్‌ మ్యాన్‌ను తలపించేలా 145 మీటర్ల (475 అడుగులు) ఎత్తులో ఉన్న  భవనాన్ని కేవలం 25 నిమిషాల్లోనే అవలీలగా ఎక్కేశాడు.చూసినవారంతా అతని సాహసానికి మెచ్చుకోవడం జరిగింది.  అయితే ఇదంతా సినిమా షూటింగ్‌ అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్లే.  ప్రసుత్తం కరోనా వైరస్‌ ప్రపంచదేశాల్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ కంటే అది ఎక్కడ వస్తుందేమోనన్న భయమే జనాల్లో ఎక్కువయిపోయింది. జనాల్లో ఆ భయాన్ని వదిలించాలంటే ఏదైనా సాహసం చేయాలని బార్సిలోనాకు చెందిన 57 ఏళ్ల అలేన్‌ రాబర్ట్‌ అనుకున్నాడు.

అందుకు స్పెడర్‌ మ్యాన్‌లాగా ఎత్తైన భవనాన్ని ఎక్కి ప్రజల్లో భయాన్ని వదిలించాలని భావించాడు. అందుకు బార్సీలోనాలో  దాదాపు 475 అడుగుల ఎత్తులో ఉన్న టోర్‌ అగ్బర్‌ ఆఫీస్‌ భవనాన్ని ఎంచుకున్నాడు. అందరూ చూస్తుండగానే  భవనం మొత్తం ఎక్కడానికి 25 నిమిషాలు, మళ్లీ కిందకు దిగడానికి 23 నిమిషాలు తీసుకున్నాడు. అతని సాహసాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ.. భయం అనేది లేకుండా ఎలా ఎక్కుతున్నాడని తదేకంగా చూస్తు ఉండిపోయారు. రాబర్ట్‌ కిందకు వచ్చిన తర్వాత పోలీసులు అరెస్టు చేసినా అతని సాహసాన్ని మాత్రం అందరూ మెచ్చుకున్నారు.(ఆ ఇద్దరికి కరోనా లేదు : మంత్రి ఈటల)

ఇదే విషయమై అలేన్‌ రాబర్ట్‌ మాట్లాడుతూ.. 'ప్రసుత్తం ప్రజలందరూ కరోనా వైరస్‌ను ఒక భూతంలా చూస్తున్నారు. దాదాపు 300 కోట్ల మంది కరోనా వైరస్‌కు భయపడుతున్నారు. నా దృష్టిలో కరోనా అనేది వారికి భయం రూపంలో కనిపిస్తుంది. వారి భయాన్ని కొంతైనా పోగొట్టాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా. నిజానికి నాకు ఆ భవనాన్ని ఎక్కేటప్పుడు చాలా భయమనిపించింది. కానీ నేను ముందు భయాన్ని వదిలేసాను.. దాంతో నాకు  భవనం ఎక్కడం పెద్ద కష్టమనిపించలేదు. ఇప్పుడు కరోనా పట్ల కూడా ప్రజలు అలానే ఉన్నారు. వారిలో భయాన్ని పోగొట్టాలనేది నా ద్యేయం.. ' అని చెప్పుకొచ్చాడు. (కరోనా దెబ్బకు కుప్పకూలిన ‘ఫ్లైబీ’)

అలేన్‌ రాబర్ట్‌ అంత ఎత్తున్న భవనాలను ఎక్కేందుకు చేతిలో చాక్‌ పౌడర్‌, క్లైంబింగ్‌ షూస్‌ మాత్రమే వాడుతుంటాడు. ఇప్పటివరకు రాబర్ట్‌ అలేన్‌ 100 రకాల ఎత్తైన బిల్డింగ్‌లను అవలీలగా ఎక్కేశాడు. అందులో దుబాయ్‌లోని బూర్జు ఖలీఫా, మలేషియాలోని పెట్రోనాస్‌ ట్విన్‌ టవర్స్‌, సిడ్నీ ఒపెరా హౌస్‌ వంటివి ఉన్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3200 మంది కరోనా బారీన పడి మృతి చెందగా, 90వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top