నయీమ్‌కు 20 ఇళ్లు | SIT officer nagireddy speaks over nayeem case | Sakshi
Sakshi News home page

నయీమ్‌కు 20 ఇళ్లు

Aug 14 2016 4:28 AM | Updated on Nov 6 2018 4:42 PM

నయీమ్‌కు 20 ఇళ్లు - Sakshi

నయీమ్‌కు 20 ఇళ్లు

నయీమ్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 ఇళ్లను గుర్తించామని సిట్ చీఫ్ వై.నాగిరెడ్డి వెల్లడించారు.

ఇప్పటివరకు 20 మందిని అరెస్టు చేశాం: సిట్ చీఫ్ నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 ఇళ్లను గుర్తించామని సిట్ చీఫ్ వై.నాగిరెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు నిర్వహించిన సోదాల్లో భారీగా ల్యాండ్ డాక్యుమెంట్లతోపాటు ఇళ్లనూ గుర్తించినట్లు పేర్కొన్నారు. శనివారం సిట్ అధికారులతో పాటు నయీమ్‌పై కేసులు నమోదైన స్టేషన్లకు చెందిన అధికారులతో నాగిరెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నయీమ్ రెండు హత్యలు చేసినట్లు నార్సింగ్ పోలీసుల విచారణలో నిర్ధారణైనట్లు తెలిపారు.

నదీమ్ అలియాస్ విజయ్‌కుమార్, వంట మనిషి నస్రీన్‌లను హత్య చేశారని, వీరి మృతదేహాలను ఎక్కడ పడేశారనేది గుర్తించాల్సి ఉందని చెప్పారు. నయీమ్ సోదరుడు అలీమ్ భార్య హీనా, అతని కూతురు చియాన్ అదృశ్యమయ్యారని, దాని వెనకా గ్యాంగ్‌స్టర్ హస్తమున్నట్లు తెలుస్తోందన్నారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత ఇప్పటివరకు 20 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. షాద్‌నగర్, నార్సింగ్ పోలీసులు అరెస్టు చేసిన నిందితులను కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు.

మిర్యాలగూడ వన్‌టౌన్, వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో అరెస్టైన వారిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేశామన్నారు. నయీమ్‌తో సాన్నిహిత్యం ఉన్న తోట కుమరస్వామి అలియాస్ టెక్‌మధు, అలియస్ రఘు, అలియాస్ అశోక్‌తో పాటు రేవల్లి శ్రీని వాస్ అలియాస్ రమేశ్‌లను భువనగిరి పోలీ సులు అరెస్టు చేశారన్నారు. నయీమ్ అతని అనుచరులపై కొత్తగా మరో 4 కేసులు నమోదయ్యాయని, మొత్తం కేసుల సంఖ్య 16కు చేరిందన్నారు.

తాజాగా నమోదైన వాటిల్లో కోరుట్ల, కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో బలవంతపు వసూళ్లకు సంబంధించి కేసులున్నాయని వివరించారు. సిట్ ఇచ్చిన కంట్రోల్ నంబర్‌కు ఇప్పటి వరకు బాధితుల నుంచి 60 ఫోన్‌కాల్స్ రాగా... వారిని సంబంధిత పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఫిర్యాదు చేయాల్సిందిగా కోరినట్లు తెలిపారు. సంబంధిత స్టేషన్‌హౌస్ అధికారులకూ కేసులు నమోదు చేయాలని ఆదేశించడంతో పాటు వాటికి సంబంధించిన సీడీ ఫైల్‌ను సిట్‌కు బదిలీ చేయాల్సిందిగా సూచించారు.

రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన సుదీర్ఘ సమావేశంలో సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, నార్సింగ్, వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్లు, కరీంగనర్‌లోని రాయికల్ ఇన్‌స్పెక్టర్, నల్లగొండ జిల్లా భువనగిరి, మిర్యాలగూడ ఇన్‌స్పెక్టర్లు, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ ఇన్‌స్పెక్టర్ పాల్గొన్నారు.

మహిళలు, పిల్లలే కవచాలుగా..
గ్యాంగ్‌స్టర్ నయీమ్ పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు మానవ కవచాలుగా మహిళలు, పిల్లలను ఉపయోగించుకున్నట్లు దర్యాప్తులో వెలుగు చూసినట్లు నాగిరెడ్డి తెలిపారు. అలాగే స్త్రీ వేషధారణతో తరచుగా ప్రయాణాలు చేసేవాడన్నారు. నయీమ్ తాజా ఫోటోలను విడుదల చేసిన నాగిరెడ్డి.. అతడు నివసించిన ప్రదేశాలు, నేరాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

సమాచారాన్ని ఫోన్/ఎస్‌ఎంఎస్/వాట్సప్ ద్వారా లేదా సిట్ కంట్రోల్ నంబర్ 9440627218కు అందజేయాలని సూచించారు. నయీమ్ ముఠా సభ్యులు, అనుచరులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం నయీమ్ దగ్గరి వారికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని.. మున్ముందు బినామీలతోపాటు ఎవరున్నా వారందరినీ బయటకు తెస్తామన్నారు.
 
కోడ్ భాష ఏంటో తెలుసుకోండి...
నయీమ్ ఇంటి వద్ద లభించిన డైరీలో ఉన్న కోడ్ భాష ఏంటో తెలుసుకోవడంపై పోలీసులు దృష్టి సారించారు. ఇందుకు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నయీమ్ అనుచరులందరిని ప్రశ్నించాలని శనివారం సిట్ చీఫ్ నాగిరెడ్డి పోలీసులను ఆదేశించినట్టు తెలిసింది. ఆ కోడ్ భాష తెలిస్తే విచారణ సులువవుతుందని, సాధ్యమైనంత తొందరగా ఆ పని చేయాలని సూచించినట్టు సమాచారం.
 
భూముల లెక్కల కోసం ప్రత్యేక బృందాలు
నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత వెలుగులోకి వస్తున్న భూముల విలువ తేల్చడంపైనా సిట్ చీఫ్ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఒకట్రెండు రోజుల్లో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఆ భూముల డాటాను సేకరించాలని, ప్రస్తుతం బాధితులు చెబుతోంది కరెక్టా కాదా అన్నది తేల్చాలని నాగిరెడ్డి సూచించారు. అలాగే నయీమ్ తన డైరీలో రాసుకున్న వారి ఇంటికి వెళ్లి పూర్తి వివరాలను సేకరించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement