బంగారు నగలు చోరీ చేసిందని యాజమాని ఫిర్యాదు మేరకు ఇంట్లో పని చేసే బాలికను పోలీసులు చితకబాదారని ఆమె
బాలికను చితకబాదిన పోలీసులు..!
మల్కాజిగిరి : బంగారు నగలు చోరీ చేసిందని యాజమాని ఫిర్యాదు మేరకు ఇంట్లో పని చేసే బాలికను పోలీసులు చితకబాదారని ఆమె కుటంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మహిళ ఫిర్యాదుపై అత్యుత్సాహం చూపించిన డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ బాలికను పిలిపించి దారుణంగా ప్రవర్తించడంతో బాధితురాలు తన గోడును మీడియాకు తెలియజేసింది. బాధితురాలు, కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం..మల్కాజిగిరి బీజేఆర్ నగర్లో నివాసముంటున్న అంజయ్య కూతురు రేణుక(17) ఇళ్లలో పనిచేస్తుంది. సత్తిరెడ్డినగర్కు చెందిన సరోజినిసామ్యూల్ అనే మహిళ ఇంట్లో పనిచేయడమే కాకుండా వారి చిన్నారి బాగోగులు కూడా చూసేది.
మూడు రోజుల క్రితం మూడు తులాల బంగారు ఆభరణాలు దొంగతనం చేసిందని మల్కాజిగిరి పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రేణుకను శుక్రవారం ఉదయం స్టేషన్కు పిలిపించి దొంగతనం ఒప్పుకోవాలంటూ ఆమెను చితకబాదారు. అక్కడకు వెళ్లిన బాలిక తండ్రిపైనా చేయిచేసుకున్నారు. ఈ సంగతి తెలుసుకున్న ఫిర్యాదు చేసిన మహిళ వారిని వదిలిపెట్టాలని చెప్పడంతో వారిని పంపించివేశారు.
కేసు నమోదు చేసి విచారించాం: ఇన్స్పెక్టర్
చోరీ చేసిందనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాధితురాలిని పిలిపించి విచారించామని ఇన్స్పెక్టర్ జి.శేఖర్ గౌడ్ తెలిపారు. బాధితురాలి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఒక వేల అలాంటి సంఘటన జరిగినట్లు ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని రావడమే కాకుండా తగిన విచారణ జరుపుతామని పేర్కొన్నారు.