తీరు మారలేదు | Intact railway police | Sakshi
Sakshi News home page

తీరు మారలేదు

Dec 12 2013 4:44 AM | Updated on Sep 2 2017 1:29 AM

తీరు మారలేదు

తీరు మారలేదు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పోలీసుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ దృశ్యం.

=పసిబాలిక హత్యకు గురైనా భద్రత గాలికే....
 =మారని రైల్వే పోలీసులు

 
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పోలీసుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ దృశ్యం. మంగళవారం మధ్యాహ్నం పోలీసుల కళ్లుగప్పి మారణాయుధాలతో స్టేషన్‌లో సంచరించిన సైకో.. ముక్కుపచ్చలారని ఏడేళ్ల ప్రియదర్శినిని దారుణంగా హతమార్చాడు. రాష్ర్టవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన నేపథ్యంలో బుధవారం నుంచి కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుందని అందరూ భావిస్తారు.

అయితే ఇక్కడి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. నిత్యం లక్షకు పైబడిన ప్రయాణికులు, సందర్శకులు రాకపోకలు సాగించే రైల్వేస్టేషన్‌లోని ఈ ప్రధాన ద్వారాన్ని దేశవ్యాప్తంగా ఎక్కడ విధ్వంసాలు జరిగినా, ఉగ్రవాదులు సంచరిస్తున్నారని హెచ్చరికలు వచ్చినా అన్ని ప్రవేశ ద్వారాలను మూసివేసి ప్రయాణికుల రాకపోకలను ఒక్క ఈ ద్వారం నుంచే అనుమతిస్తారు.

ఇక్కడ మూడు మెటల్ డిటెక్టర్‌లను ఏర్పాటు చేయడంతోపాటు, లగేజీలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా రైల్వే పోలీసు సిబ్బందిని నియమించారు. ఇంత కీలకమైన ఈ ద్వారం వద్ద కాపలకాసే రైల్వే పోలీసుల తీరులో ఎన్ని ఘటనలు జరిగినా మార్పు కన్పించడంలేదు. బుధవారం మెటల్ డిటెక్టర్‌లకు మాత్రమే భద్రత విధులు అప్పగించి ఇద్దరు మంతనాల్లో మునిగిపోగా, మరొకరు బల్లపై కూర్చొని సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేయడం కన్పించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement