సినిమాకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు.
నాగోలు: సినిమాకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి బంగారు, నగదు ఎత్తుకెళ్లిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగోలు డివిజన్ సాయిరాంనగర్ కాలనీకి చెందిన ముత్యంకుమార్ ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లారు.
తిరిగి వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నట్లు గమనించారు. బీరువాలో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు, వెండి సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు యజమాని గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.