ఫేస్‌బుక్ మోసగాడి అరెస్టు | Facebook fraudster arrested | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ మోసగాడి అరెస్టు

Aug 22 2016 6:26 PM | Updated on Jul 27 2018 12:33 PM

ఫేస్ బుక్ ద్వారా స్నేహం చేసుకుని మోసం చేసిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా స్నేహం చేసుకుని పలువుర్ని మోసం చేసిన నిందితున్ని పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 3 లక్షల విలువైన 10 తులాల బంగారు ఆభరణాలు, ఒక ల్యాప్‌ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుని వివరాలు సోమవారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పశ్చిమమండల డీసీపీ వెంకటేశ్వర రావు, ఎసీపీ వెంకటేశ్వర్లు వివరించారు. మెహిదీపట్నం హుడా కాలనీకి చెందిన రియాజ్ అహ్మద్ అలియాస్ మహ్మద్ యాహ ఉల్ హసన్ అలియాస్ అకిత్ (32) ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నాడు. 
 
ఫేస్‌బుక్‌లో కొద్దిగా అమాయకంగా కనిపించే ఫోటోలను ఎంపికచేసుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేవాడు.. వారు యాక్సెప్ట్ చేయగానే వారి ఫోటోలకు మంచి కామెంట్లు, లైక్‌లు కొట్టి వారు ఆన్‌లైన్‌లో ఉన్న సమయంలో చాటింగ్ చేయడం మొదలు పెట్టేవాడు. ఫోన్ నెంబర్లు తీసుకుని పోన్‌చేసి పరిచయం పెంచుకుని ఒక్కసారి కలవాలి అని వారిని పర్సనల్‌గా కలిసి మాటల్లో పెట్టి వారు తాగే మంచి నీళ్లల్లో, కూల్‌డ్రింక్‌లల్లో మత్తు పదార్ధం కలిపి.. వాళ్లు స్పృహ తప్పగానే.. వారివద్ద ఉన్న బంగారు ఆభరణాలు, పర్సులు, ఫోన్, ల్యాప్‌ట్యాప్ దోచుకుంటాడు.
 
ఇదే తరహాలో ఇతను నగరంలో పంజగుట్ట, గచ్చిబౌలి, జవహర్‌నగర్, నేరేడిమెట్ పోలీస్‌స్టేషన్ పరిధుల్లో ఒక్కొక్కరిని చొప్పున మోసం చేశాడు. దొంగిలించిన సొమ్ము అమ్ముతుండగా సోమవారం నిందితున్ని పంజగుట్ట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఫేస్‌బుక్‌లో అపరిచితులు ఎవరైనా ఫ్రెండ్ రిక్వస్ట్ పంపితే దాన్ని యాక్సెప్ట్ చేయరాదని డిసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. అపరిచితుల పట్ట జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement