నోటిఫికేషన్ నాటి నుంచే మద్యం బంద్ చేయాలి | Alcohol should be spared from the notification of | Sakshi
Sakshi News home page

నోటిఫికేషన్ నాటి నుంచే మద్యం బంద్ చేయాలి

May 19 2014 3:45 AM | Updated on Sep 19 2018 6:31 PM

పోలింగ్‌కు రెండు రోజుల ముందు మద్యం అమ్మకాలు బంద్ చేయడం కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నాటి నుంచే బంద్ చేయాలని ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కమిటీ ప్రతినిధులు సూచించారు.

 ఎన్నికల నిఘా వేదిక చైర్మన్ జస్టిస్ అంబటి లక్ష్మణ్‌రావు
 
 దోమలగూడ, న్యూస్‌లైన్: పోలింగ్‌కు రెండు రోజుల ముందు మద్యం అమ్మకాలు బంద్ చేయడం కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నాటి నుంచే బంద్ చేయాలని ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కమిటీ ప్రతినిధులు సూచించారు. అప్పుడే ఎన్నికల్లో మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుందన్నారు. దోమలగూడలోని ఇందిరాపార్కు చౌరస్తా సమీపంలోని హైదరాబాదు స్టడీ సర్కిల్ సమావేశ హాలులో ఆదివారం ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. వేదిక చైర్మన్ జస్టిస్ అంబటి లక్ష్మణ్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జస్టిస్ రెడ్డప్పరెడ్డి, డాక్టరు రావు చెలికాని, ఓయూ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ తిరుపతిరావు, ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్ లక్ష్మణ్‌రెడ్డి, కో ఆర్డినేటర్ గుండె కనకరత్నం, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ పద్మనాభరెడ్డి, కె.సుబ్బరంగయ్యలతో పాటు 23 జిల్లాల నుంచి జిల్లాకు ముగ్గురు వంతున ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులలో ఎవరినీ ప్రాసిక్యూట్ చేయడం లేదని, ఎవరికీ శిక్షలు పడటం లేదని, సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఎన్నికల కేసులను సత్వరమే పరిష్కరించాలని సమావేశం కోరింది. జస్టిస్ అంబటి లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ, సీమాంధ్రలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. కేంద్రంలోనూ, తెలంగాణ, సీమాంధ్రలోనూ ప్రభుత్వాల ఏర్పాటుకు సింగిల్ పార్టీలకు పూర్తి మెజార్టీ ఇచ్చి ప్రజలు వివేకవంతులని నిరూపించుకున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా తనిఖీల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో డబ్బు అత్యధికంగా పట్టుబడిందని, డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచారని వాపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement