రాజధానికోసం ఇంత వెంపర్లాటా?

KSR Manasulo Maata With Former Chief Home Secretary - Sakshi

కొమ్మినేని శ్రీనివాసరావుతో హోం శాఖ మాజీ కార్యదర్శి కె. పద్మనాభయ్య

ప్రపంచంలోనే ఉత్తమ రాజధాని  అంటూ పదే పదే బాకాలూదడం చాలా తప్పని హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య పేర్కొన్నారు. రాజ్యాంగం విధించిన 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లను అదనంగా కల్పిం చటం అసాధ్యమని, ఆరునెలల్లో పలానావారికి రిజర్వేషన్లు ఇచ్చేస్తామని ప్రకటించడం బోగస్‌ అని ఆక్షేపిం చారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారనీ, ఓటుహక్కును సరిగా వినియోగించే సామర్థ్యం వారికుందని, ఎవరిని దింపాలో, ఎవరిని గెలిపించాలో కూడా వారికి బాగా తెలుసంటున్న పద్మనాభయ్య అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

మీ బాల్య జ్ఞాపకాల గురించి చెబుతారా?
కృష్ణాజిల్లా కౌతులం అనే పెద్ద గ్రామంలో పుట్టాను. సంపన్న కుటుంబంలోనే పుట్టాను. అతి సామాన్యమైన బీద కుటుంబంలో పెరిగాను. కారణం ఊహ తెలిసేసరికి మా ఆస్తి మొత్తం పోయింది. అందుకే నాది కష్టమైన బాల్యం. గుడివాడ కాలేజీలో చది వాను. తర్వాత ఆంధ్రయూనివర్శిటీకి వెళ్లాను. యూనివర్సిటీలో ఐఏఎస్‌కు ఎంపికైన అభ్యర్థిని ఊరేగిస్తుంటే చూశాను. ఆ స్ఫూర్తితోనే నేనూ ఐఏఎస్‌ చదివి అదృష్టపశాత్తూ పాస్‌ అయ్యాను. 

ఒక రాష్ట్రం 70 వేల కోట్లు కావాలి అంటే ఇచ్చేస్తారా?
విభజన సమయంలో భారీ సహాయం చేస్తామని కేంద్రప్రభుత్వమే ఒప్పుకుంది కదా. పలానా సహా యాలు చేస్తాం అని విభజన చట్టంలో స్పష్టంగా రాశారు. 13వ షెడ్యూల్లో  విద్యాసంస్థలు ఇన్ని పెడతాం అని చెప్పారు. వాటిని ఇవ్వాలి కదా. 

ఇప్పటికే 11 విద్యాసంస్థలను ఇచ్చారు కదా?
పదేళ్లలో అన్ని విద్యా సంస్థలనూ పెడతామని కేంద్రం చెప్పింది. ఇప్పటికి నాలుగేళ్లయింది. ఒక్క సంస్థకు కూడా బిల్డింగ్‌ లేదు. అన్నీ తాత్కాలికంగా నడుస్తున్నాయి. ఇప్పటికి వీటన్నిటికీ కలిపి 500 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ లెక్కన మొత్తం రావాలంటే 30 ఏళ్లు పడుతుంది. అంటే అంతవరకు మనం వేచి ఉండాలా? పదేళ్లలో అన్నీ ఇస్తామన్నప్పుడు సంవత్సరానికి ఎంతవుతుందో లెక్కలు వేసి అదైనా ఇవ్వాలి కదా? స్టీల్‌ ప్లాంట్, పోర్టులు, మెట్రో, రైల్వే జోన్, వైజాగ్‌–చెన్నై కారిడార్‌ వంటి వాటికి ఫీజిబులిటీ ఉందా లేదా అని ఆరు నెలల్లో తేల్చివేసి మరో ఆరునెలల్లోగా నిర్ణయం తీసుకుంటామని చెప్పిన కేంద్రం ఇంతవరకు ఏం చేసింది? విజయవాడ మెట్రో లాభదాయకం కాదని 2017లో అంటే మూడేళ్ల తర్వాత చెబితే ఎవరిది తప్పు?

ఎందువల్ల కేంద్రం సహాయం చేయలేకపోతోంది?
14వ ఫైనాన్స్‌ కమిషన్‌ ప్రత్యేక హోదాను రద్దు చేయాలని చెప్పిందట. కేంద్రం దీన్ని ముందుకు తీసుకొచ్చింది. కాని అది తప్పు. నిజంగానే తప్పు ప్రకటన. దాన్ని ఇంకా చర్చకు పెట్టడం దేనికి?

పోలవరం గురించి మీ అభిప్రాయం?
పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. కొన్ని మండలాలను ఏపీలో కలి పారు. మొత్తం నిధులు ఇస్తామని చెప్పారు. ఏ ప్రాజెక్టునైనా నీతిమంతంగా పూర్తి చేయడం వాంఛనీయం. ఎవరు చేపట్టినా అవినీతికి దూరంగా ఉంటేనే మేలు జరుగుతుంది. ఆ నీతి తప్పే అవకాశం ఉన్నప్పుడు కేంద్రం చేపట్టినా, రాష్ట్రం చేపట్టినా ఫలితం ఒకటే.

కేసీఆర్, బాబులపై మీ అభిప్రాయం?
మొత్తం మీద చూస్తే తెలంగాణలో పాలన బాగుంది. ఒకకోణంలో కేసీఆర్‌ చాలా సమర్థుడు. ఆయన కేబి నెట్‌ కూడా సమర్థులతో నిండి ఉంది. కానీ అమరావతికి కానీ, విజ యవాడకు ఇంతవరకు నేను విభజన తర్వాత వెళ్లలేదు కాబట్టి అక్కడ ఏం జరుగుతోంది అనేది నేను చెప్పలేను. 

రాజధానికి 50 వేల ఎకరాలు అవసరమా?
రాజధాని విషయంలో బాబు వాదనతో నేను ఏకీభవించలేను. ప్రపంచంలోనే ఉత్తమ రాజధానిని కట్టాలంటే డబ్బు అవసరం. నీవద్ద డబ్బులుంటే కట్టవచ్చు. పదేళ్లు రాజధానిలో పరిశ్రమలు వచ్చి నిర్మాణాలు జరిగితే అప్పుడు రాజధాని నిర్మాణం గురించి ఆలోచించవచ్చు. ఇంకా ఇతర సమస్యలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ పక్కనబెట్టి ఉత్తమ రాజధాని అంటూ పదే పదే ప్రచారానికి దిగటం చాలా తప్పు. 

తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపులపై మీ అభిప్రాయం?
ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ఈ దేశంలో ఉందా అని సందేహం వేస్తోంది. లేదసులు. ఆంధ్రలో ఎన్నికైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? తెలంగాణలో ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? ఇప్పుడు ఈ పార్టీల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఏమయ్యారు ఇప్పుడు? ఆంద్రాలో 23 మంది, తెలంగాణలో 25 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్‌ అయితే ఇంతవరకు వారిపై ఏ నిర్ణయాలూ తీసుకోలేదు.

మొత్తం రుణమాఫీ చేస్తామనడం మోసం కాదా?
ఇలాంటి హామీలు ఇవ్వడమే తప్పు. నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని తాజాగా ప్రకటించారు. నాలుగేళ్లయ్యాక ఎన్నికల నేపధ్యంలో ఇస్తున్నారనే ఆరోపణ సహజంగానే వస్తుంది మరి. పైగా నిరుద్యోగులను ఆదుకోవడం అంటే దానికి కూడా నిర్ణీత గడువు ఉండాలి. సంవత్సరమో, రెండేళ్లో భృతి ఇస్తాం కానీ ఆ లోపలన మీరు ఏదైనా పని, ఉద్యోగం చూసుకోవాలి అని షరతు ఉండాలి. వరుసబెట్టి మాఫీలు చేస్తామనటం ఏమిటి?

రిజర్వేషన్లపై నేతల అడ్డగోలు ప్రకటనలు సరైనవేనా?
ఏ రిజర్వేషన్‌ అయినా రాజ్యాంగంలో విధించిన 50 శాతం పరిమితికి మించినట్లయితే అది రిజర్వేషన్‌ కాదు. జనాభాలో మెజారిటీ రిజర్వేషన్‌ పరిధిలోకి రావడం అనేది అర్థరహితం. 50 శాతం రిజర్వేషన్‌ అనేది అత్యంత హేతుపూర్వక నిర్ణయం. తమిళనాడులో బ్రిటిష్‌ కాలం నుంచి పరిమితికి మించిన రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాటిని ఇప్పుడూ కొనసాగిస్తున్నారు. అది అక్కడికే పరిమితం. అన్ని చోట్లా ఆ  పరిమితిని మించి ఇవ్వాలి అంటే అది కుదిరే పని కాదు. ఆరునెలల్లో పలానావారికి రిజర్వేషన్లు ఇస్తాం అనే ప్రకటనలు బోగస్‌. అలా జరిగే అవకాశమే లేదు. ఇలాంటి ప్రకటనలకు బదులుగా,  సమాజాన్ని మొత్తంగా డివైడ్‌ చేసి జనాభా ప్రకారం నూటికి నూరు శాతం రిజర్వేషన్లు అందరికీ ఇచ్చేస్తే గొడవే లేదు కదా.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీరిచ్చే సందేశం?
సందేశం కాదు కానీ, ప్రజలు తమ ఓటు హక్కును  సరిగా వినియోగించుకోవాలి. మీ ఓటు విలువైనది. మన ప్రజలు చాలా తెలివైన వారు. అంతటి శక్తిమంతురాలైన ఇందిరాగాంధీనే వారు ఏకంగా దింపేశారు. మళ్లీ ఆమెను అలా సెలెక్ట్‌ చేసుకున్నారు. దేశం ఎలా నడుస్తోందీ, ఏం జరుగుతోందీ ప్రజలకు తెలుసు. వారు సరైన నిర్ణయమే తీసుకుంటారు.

(ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://bit.ly/2Ojb5K9
https://bit.ly/2OQman6
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top