‘ఇన్‌సైడర్‌’కు ‘జోడీ’ అవుట్‌సైడర్‌!

ABK Prasad Article On Chandrababu Naidu - Sakshi

రెండో మాట

‘‘ప్రపంచంలో కొంతమంది జర్నలిస్టులు న్నారు. జనాభాలోని కొందరు ఇతరుల మాదిరే వీరూ డబ్బుకు కక్కుర్తిపడి తమ వృత్తి ధర్మమైన నిజాయితీని తాకట్టు పెట్టేసుకుంటు న్నారు. జర్నలిస్టుల్లో కొద్దిమంది మాత్రమే బెదిరింపులకు (బ్లాక్‌మెయిల్‌) లొంగి సాగిల పడనివారుంటారు.’’– ప్రసిద్ధ అమెరికన్‌ మీడియా విశ్లేషకుడు డాక్టర్‌ పాల్‌ క్రీగ్‌ రాబర్ట్స్‌ (25–10–2019)

‘‘అనేక స్థానిక కారణాలు, ప్రాంతాల అవసరాల దృష్ట్యా ప్రపం చంలో 12–16 దేశాల్లో ప్రాంతాలవారీగా ఒక రాజధాని కాదు, రెండేసి, మూడేసి రాజధానులు ఒకచోట పరిపాలనా కేంద్రంగా, శాసన సభా వేదికలుగా, న్యాయ వ్యవస్థా కేంద్రాలుగా రెండేసి, మూడేసి రాజ ధానీ నగరాలున్నాయి.’’ – మాటా రోజన్‌ బెర్గ్‌ (01–03–2019)

రాజకీయంగా అడుగూడిపోయిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, అస్తుబిస్తు సంఖ్యా బలంతో రోజురోజుకీ మరింత తరుగుతూ ప్రతిపక్ష నాయకుడిగా హోదాను కూడా కోల్పోయే దశలో ప్రవేశించిన చంద్రబాబు నాయుడికి ఓ ‘కొత్త సమస్య’ చేతికి దొరి కింది. తాడూ బొంగరం లేని చోటును రాజధానిగా బలవంతాన ఎంపిక చేసుకుని, ప్రతిపక్షంతో సంబంధం లేకుండా ఆదరాబాద రాగా అమరావతికి ప్రయాణం కట్టించాడు చంద్రబాబు. అదేమంటే తాను అధికారంలో ఉండగా శాసనసభలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అని ప్రకటించినప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఆమో దించినట్టే చెప్పారు గదా అని ఇప్పుడు బాబు ఎత్తిపొడవడానికి ప్రయ త్నిస్తున్నాడు. కానీ ఈ ప్రకటన వెనుక ఉన్న బాబు దుష్ట ఆలోచనను, జరిగిన పరిణామాలను ప్రజలు మరిచిపోరు! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు అర్ధంతరంగా, కేంద్ర కాంగ్రెస్‌ అధిష్టాన వర్గం నిర్ణయా నికి గంగిరెద్దులా తలూపి తెల్లకాగితంపై బాబు సంతకం చేసివచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను మనం మరిచిపోరాదు.

విభజనకు పావులు కదుపుతూనే నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం.. విడగొడుతున్న ఆంధ్ర ప్రాంతానికి రాజధానిగా, పర్యావరణ పరిస్థి తులు, ఇతర భౌగోళిక సానుకూలతలు, వనరులు వగైరా సానుకూల ప్రదేశాలు ఏవేవో చూసి, సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అగ్ర శ్రేణి నిపుణులతో శివరామకృష్ణన్‌ కమిటీని నియమించాలని ఆదే శించింది. వెంటనే ఆ కమిటీ కొన్ని మాసాలు ఆంధ్రా ప్రాంతాలను పర్యటించి తన సిఫార్సులతో నివేదిక సమర్పించింది. దాన్ని చంద్ర బాబు శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించి, నిర్ణయం తీసుకోవల సింది. కానీ శాసనసభ ముందుకు ఆ నివేదికను తీసుకురానివ్వ కుండా, తన కొలువులో ఉన్న మంత్రి నారాయణ పేరుతో అనుకూల కమిటీని ఆగమేఘాల మీద వేయించి దాని నివేదికను ప్రవేశపెట్టి శాసనసభలో ఆమోదింపచేసుకున్నాడు బాబు. అది మొదలు అసలు కొత్త రాష్ట్ర రాజధాని ఎక్కడ వస్తుందో బహిరంగంగా చెప్పకుండా జాగ్రత్త వహించాడు. ఆ తర్వాత రాజధాని నూజివీడు, గన్నవరం, విజయవాడ–గుంటూరు మధ్య కూడా కావచ్చునని ఒక సట్టా వ్యాపారి మాదిరి లీకేజీలు వదిలాడు. ఈలోగా తన అనుయాయులు కొందరు ఈ అన్ని ప్రాంతాల్లోనూ భూ దందాలు మొదలెట్టేశారు. ఆ తర్వాత తన ఆప్తులకు, తన మంత్రులకు అమరావతి చుట్టూ భూములు కొనుక్కోవడానికి వీలు కల్పించి స్పెక్యులేటివ్‌ వ్యాపారా నికి బాబు తెరలేపాడు. బాబు అండతో జరిగిన లోపాయికారీ తతంగం రాజకీయ స్పెక్యులేటివ్‌ వ్యాపారం ఎవరికైనా ఎలా తెలు స్తుంది మరి? తీరా చూస్తే అమరావతిని భూముల కొనుగోళ్ల లావా దేవీల కేంద్రంగా బాబు మార్చాడు. మోతుబరులు సహా, మధ్యతర గతి, పేద, బడుగు, బలహీన వర్గాల భూములను అమరావతి రాజ ధాని పేరిట సట్టా వ్యాపార కేంద్రాలుగా మార్చాడు. పైగా ఈ వ్యాపారంలోకి కొందరు జర్నలిస్టులనూ దించాడు. అంతే గాదు, తరచూ ముంపునకు గురయ్యే ప్రాంతం అమరావతి అని, ఆ భూమిలో 15 అడుగులలోనే నీరు ఉబికి వస్తుందనీ, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఆ ప్రాంతం పెద్ద నగరాల నిర్మాణానికి అనుకూలం కాదని కేంద్ర పర్యావరణ పరిరక్షణా సాధికార సంస్థ హెచ్చరించి, నివారిస్తూ వచ్చింది. ఈ కారణాన్ని శివరామకృష్ణన్‌ కమిటీ కూడా స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతాలనూ సూచించింది. వాటిలో ఒకటి విశాఖ దొనకొండ, వినుకొండ ప్రాంతాలు కూడా ఉన్నాయి.

అయినా సట్టా వ్యాపారిగా మారిన రాజకీయ పాలకుడు చంద్ర బాబు దృష్టి అమరావతిపైనే లగ్నమయింది. రైతుల్ని, వ్యవసాయ కార్మికుల్ని నిలువునా ముంచేశాడు. మూడు, నాలుగు పంటలు పండే అమరావతి పరిసర ప్రాంతాల సుక్షేత్రాలను వదులుకోవడానికి ఇష్ట పడకపోతే అర్ధరాత్రి పూట పంటల్ని తగలబెట్టించారు. ఇందుకు ఎదురు తిరిగిన పేదలపైన కేసులుపెట్టి, వేధించేందుకు సాహసిం చారు. అలాంటి దళితులలో జగన్‌ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్‌ సభ్యుడైన నందిగాం సురేష్‌ ఒకరు. అతణ్ణి అప్రూవర్‌గా మారమని పోలీసులచే కొట్టించారు. పంటల్ని తానే తగలబెట్టించానని అంగీ కరిస్తే చంద్రబాబుతో స్వయానా 50 లక్షలు ఇప్పిస్తామని పోలీసులు వేధించినా సురేష్‌ లొంగలేదు. ఇది బాబు రాజధాని అమరావతి లోగుట్టు. రాష్ట్రానికి తన అసమర్థపాలన ద్వారా బాబు చేసిన రెండు న్నర లక్షల కోట్ల అప్పులు చాలక మరో లక్షన్నర కోట్లు వెచ్చిస్తేగానీ అమరావతికి ముక్తి కలగని దౌర్భాగ్య స్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలోనే నూతన ముఖ్యమంత్రి జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర అభివృద్ధికి పరిపాలన, ప్రజా సదుపాయాల వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులను, కార్యనిర్వహణ కేంద్రాలను, న్యాయ వ్యవస్థలను వికేంద్రీకరించడం సబబన్న ఆలోచనకు రావడం శుభ సూచకం. ఈ సమయంలో సమగ్ర రాజధాని నిర్మాణపు ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసులు చేదోడువాదోడు కాగలవు. స్పెక్యులేషన్‌ ద్వారా లోపాయికారీగా ఎవరో బయటి వ్యాపారులు కాదు, సొంత క్యాబినెట్‌ మంత్రులతోనే ఎక్కడెక్కడినుంచో వచ్చి అమరావతి భూముల్ని ప్రలోభాలతో, బెది రింపులతో కొనిపించి, వ్యాపారంలోకి దించారు. ఇప్పుడు ‘రాజధాని’ చెదిరితే గొల్లుమంటున్నారు, కానీ చిన్న, మధ్యతరగతి అమాయక రైతు కుటుంబాల బతుకులు దెబ్బతినకూడదు. నేను విన్నాను, నేను న్నానన్న జగన్‌ ప్రజాస్వామిక భరోసా, భూముల సరిహద్దులు చెరిగినా, వారి మనసులు చెదరనివ్వదు.

ఈలోగా ఢిల్లీ కేంద్రంగా వ్యాపార వార్తా కథనాలు అల్లే శేఖర్‌ గుప్తా అనే ఒక జర్నలిస్టు అండతో చంద్రబాబు వర్గం, స్థానిక ‘ఉంపుడు’ పత్రికా నిర్వాహకుల సహాయంతో జగన్‌ను, ఆలో చనాపరమైన ఆయన ప్రతిపాదనలపైన ‘పిచ్చితుగ్లక్‌’ అంటూ రాతలు రాయిస్తున్నారు. ‘చండీగఢ్‌ తర్వాత దేశంలో మరో గ్రీన్‌ఫీల్డ్‌ నగరం లేదని, మూడు రాజధానుల ఆలోచన ఆచరణీయం కాదనీ, రాజధాని కేంద్రంగా అమరావతి నిర్మాణం దేశానికి అవసరమనీ’ బాబు మైక్‌ ద్వారా సందేశమివ్వడానికి సాహసించాడు శేఖర్‌గుప్తా. అసలు పంజాబ్, హరియాణాలు రెండింటికీ ఒకే రాజధాని పొసి గినప్పుడు ఒక రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణకు అనువైన పాలనా వికేంద్రీకరణ యంత్రాంగం ఉంటే నష్టం ఏమిటో గుప్తా చెప్పలేక పోయాడు.

మహానగరాలు శతాబ్దాలు గడిస్తే కానీ నిర్మాణమై వృద్ధిలోకి రాలేదు. కానీ చంద్రబాబు తాను 50 ఏళ్లలో అమరావతిని మహా నగరం చేస్తానని ప్రగల్భాలు పలికాడు. ప్రపంచబ్యాంకు అధికా రులు, అమరావతి భూముల సమీకరణ కింద ఇచ్చిన భూములకు నష్టపరిహారంగానీ, హామీపడిన ఇళ్ల స్థలాలుగానీ తమకు ఇవ్వలేదని పేద రైతులు ఫిర్యాదు చేసి గగ్గోలు పెట్టిన దరిమిలా రాజధాని నిర్మాణానికి రుణాలిచ్చేందుకు ముందుకు రాకపోవడమే గాక, ఎందుకు ఇవ్వబోవటం లేదో కూడా తమ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. కానీ  బాబు మైకంలో చిక్కుకున్న శేఖర్‌గుప్తాకు ఇవేవీ పట్టవు. తెలుగు ప్రజల్ని నిలువెల్లా మోసగించి, ఆర్థికంగా రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్ల మేర అప్పులు చేసి, ప్రాజెక్టులను, ప్రజల సామాజిక ప్రయోజనాలను విస్మరించి చిప్ప చేతికిచ్చి, అమరావతి పేరును మాత్రం మిగిల్చిన చంద్రబాబుకు అకస్మాత్తుగా ఆప్తుడ య్యాడు. అమరావతిలో ఇంతవరకూ బాబుకి ‘ఇన్‌సైడర్‌ ట్రేడర్స్‌’ ఉన్నారు. ఇప్పుడు శేఖర్‌ గుప్తా అవతరణతో ‘అవుటర్‌ ట్రేడర్‌’ సాయం, వత్తాసు దొరికినట్టయింది. ఆంధ్రుల రాజధానిగానే అమరా వతి కూడా ఉన్నా, చంద్రబాబుని సంతోషపెట్టడానికి జగన్‌ను పేరుపెట్టి దూషించడానికి సాహసించాడు.

దేశయాత్రల్లో బాబు మన జర్నలిస్టులు కొందరిని విమానా లపైన తీసుకెళ్లి మరీ విదేశాల్లో ఖుషీ చేసి పంపితే తిరుగు ప్రయా ణంలో హైదరాబాద్‌ విమానాశ్రయంలో దొంగ సరుకు దిగుమతి చేసిన కేసులో పట్టుబడిన వైనం ‘బ్లిడ్జ్‌’ (బాంబే), ‘ది టెలిగ్రాఫ్‌’ (కలకతా)్త పత్రికల్లో ఆనాడే ఫ్లాష్‌ అయింది. అందుకే క్రిస్తోఫర్‌ లోగ్‌ రాసిన ఒక కవితకు ‘ప్రొఫెసర్‌గారి రిపోర్టు’ పేరిట శ్రీశ్రీ అనువాదం ఏం చెబుతుందో చూడండి: ‘‘మానవుడు రాజకీయజీవి/ ముఠాలుగా తిరిగేవాడు/ ఒక గుంపు ఇంకో గుంపును ద్వేషించేది/ అబ్బో! ఎన్నెన్ని విశేషాలనుకున్నారు/ అన్నింటిలోనూ ప్రధానమైనది ‘దేశాభిమానం’!!

ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top