టీడీపీలో నిర్వేదం
సీమాంధ్రలో పోలింగ్ సరళి తెలుగుదేశం పార్టీలో నిర్వేదాన్ని నింపింది. బుధవారం పోలింగ్ సరళిపై ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు అందిన నివేదికలు ఆ పార్టీ నేతలను తీవ్ర నిరుత్సాహపరిచాయి.
గెలుపుపై ధీమా వ్యక్తం చేయలేని నేతలు
ఓటింగ్ సరళిని పర్యవేక్షించిన చంద్రబాబు
ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల్లో బిజీబీజీ
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో పోలింగ్ సరళి తెలుగుదేశం పార్టీలో నిర్వేదాన్ని నింపింది. బుధవారం పోలింగ్ సరళిపై ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు అందిన నివేదికలు ఆ పార్టీ నేతలను తీవ్ర నిరుత్సాహపరిచాయి. పోలింగ్ ప్రారంభమైంది మొదలు ముగిసేవరకూ ఎన్నికల సంఘానికి శరపరంగా ఫిర్యాదులు చేయటంలో పార్టీ యంత్రాంగం నిమగ్నమైంది. ప్రతిసారీ ఎన్నికలు ముగిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ వద్ద బాణసంచా కాల్చి తాము గెలుస్తామని హడావిడి చేసేవారు. ఈసారి అలాంటి పరిస్థితి కనిపించలేదు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎంపిక చేసిన టీవీ చానళ్ల వారిని తన నివాసానికి పిలిపించుకుని విడివిడిగా మాట్లాడారు. అభివృద్ధికి, అనుభవానికి ప్రజలు ఓటు వేశారని, తాము ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని చెప్పారు. ఓటింగ్ సరళిని విశ్లేషించి గురువారం మీడియాతో మాట్లాడతామని టీడీపీ నేతలు తెలిపారు.
పోలింగ్ ప్రారంభమైనప్పటినుంచి ముగిసేవరకూ బాబు తన నివాసంనుంచి ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తూ గడిపారు.
ఆయా నియోజకవర్గాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు, స్థానిక ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు జరిపా రు. ఆయన సూచనల మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.సంపత్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్కు సుమారు 40 నుంచి 50 వరకూ ఫిర్యాదులు చేయటంతో పాటు లేఖలు రాశారు. పార్టీ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, వేం నరేందర్రెడ్డి తదితరులు ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదులు చేశారు. పార్టీ కార్యాలయంలో టీడీ జనార్దనరావు, మోత్కుపల్లిలు పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.
ఎన్నికల సమయం ముగిసే గడువు దగ్గరపడుతున్న కొద్దీ అవసరమైతే ఓటర్లకు ఎంత కావాలంటే అంత డబ్బులు వెదజ ల్లి పోలింగ్లో పాల్గొనేలా, లేదంటే వారు తప్పకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేసే వారయితే పోలింగ్కు రాకుండా డబ్బులిచ్చి అడ్డుకోవాల్సిందిగా తండ్రీ, కుమారులు సూచించారు.


