
'ఆమె’కు వందనం ..
జిల్లా రాజకీయాల్లో మహిళలు తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి తీర్పే అభ్యర్థుల భవిష్యత్తును మార్చింది.
ఆమె.. అడ్డంకులను అధిగమించింది.. అభివృద్ధివైపు అడుగులు వేసింది.. అన్నింటా తానై నిలిచింది.. లక్ష్యాలను సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. మహిళలు పురుషులతో సమానంగా అభివృద్ధి చెందుతున్నారనేది నిన్నటి మాట. పురుషుల కంటే రెట్టింపు స్థాయిలో అవకాశాల్ని అందిపుచ్చుకుని తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారనేది నేటిమాట. రాజకీయం, వ్యాపారం, పాలనాపరమైన రంగాల్లో మహిళలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారు. జిల్లాలోనూ మహిళలు అత్యున్నత స్థాయిలో కొనసాగుతూ ఆదర్శప్రాయంగా నిలిచిన విజయగాధలెన్నో ఉన్నాయి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా రాజకీయాల్లో మహిళలు తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి తీర్పే అభ్యర్థుల భవిష్యత్తును మార్చింది. జిల్లాలో స్థానిక సంస్థల్లో 771 స్థానాలున్నాయి. వీటిలో అత్యధికంగా మహిళలు 424 మంది ఉండడం గమనార్హం. స్థానిక సంస్థల్లో ప్రభుత్వం మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించగా.. అంతకు మించి 55శాతం స్థానాల్లో సీట్లు దక్కించుకున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రజాప్రతినిధుల ఓట్లే ఇద్దరు అభ్యర్థుల గెలుపును నిర్దేశించాయి. జెడ్పీ చైర్మన్గా సునీతారెడ్డి రెండోసారి ఎన్నికై విజయవంతంగా పాలన సాగిస్తున్నారు.
కీలకవిభాగాల్లో..
జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లోనూ మహిళలు అగ్రభాగాన నిలిచారు. ఎస్పీగా రాజేశ్వరి కొనసాగుతున్నారు. జేసీగా ఆమ్రపాలి విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లా నీటి యాజమాన్యసంస్థ, జిల్లా పంచాయతీ శాఖ, పౌరసంబంధాల శాఖ, డీఆర్డీఏ ఏపీడీలుగా ఇద్దరు మహిళలే ఉన్నారు. ఇందిరాక్రాంతి పథంలో 5 మేనేజర్ పోస్టులకుగాను నలుగురు మహిళలు కొనసాగుతున్నారు.
మండలాల్లోనూ ‘మహిళా రాజ్యం’
జిల్లాలో పాలనా పరమైన అంశాల్లోనూ మహిళలు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. మండల అభివృద్ధికి మూలమైన ఎంపీడీఓ పోస్టుల్లోనూ ఎక్కువగా మహిళలే ఉన్నారు. మొత్తం 33 ఎంపీడీఓలకు గాను 17 మంది మహిళలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆరు మండలాల్లో తహసీల్దార్లుగా మహిళలే ఉన్నారు.
స్వయం ‘శక్తి’
జిల్లాలో 33,761 స్వయం సహాయక సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో దాదాపు 3.25లక్షల వరకు మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఏటా కోట్ల రూపాయల రుణాలు తీసుకుని స్వయం ఉపాధిలో విజయవంతమయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14వేల సంఘాలకుగాను రూ. 250కోట్ల రుణాలు ఇచ్చారు. ఈ రుణాలతో మహిళలు వ్యవసాయం, పాడి పరిశ్రమతో పాటు స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
సేవకు నీరాజనం..
బతుకు ‘చక్రం’ తిప్పుతూ ఒకరు.. సాహితీ వనంలో విరిసిన కుసుమం మరొకరు. ఒకరు ఆటో నడుపుతూ కుటుంబాన్ని లాగుతుంటే.. మరొకరు మహిళా సమస్యలను తన రచనలతో లోకానికి చాటుతున్నారు. విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు అందుకుంటున్న తారాబాయి, శ్యామలమ్మలపై ప్రత్యేక కథనం..
బతుకు ‘చక్రం’ తిప్పుతూ.. రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైన ఆటోడ్రైవర్ తారాబాయి
ఇబ్రహీంపట్నం: పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని నిరూపించింది మారుమూల తండాకు చెందినఓ గిరిజన మహిళ. స్టీరింగ్ పట్టి కుటుంబ భారాన్ని నెత్తినవేసుకుంది. 18 ఏళ్లుగా సెవెన్ సీటర్ ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైంది. మంచాల మండలం ఎల్లమ్మతండాకు చెందిన దుద్లమ్మ, బిక్యానాయక్ దంపతులకు తారాబాయి జన్మించింది. ఆమెకు తోడు అక్క, తమ్ముడు ఉన్నారు. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడ్డ కుటుంబం. తారాబాయి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ నాలుగో తరగతి వరకు చదువుకుంది. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలిచేది. కరువుతో కుటుంబం అప్పుల పాలైంది. బ్యాంకు రుణం తీసుకొని గేదెలను కొనుగోలు చేసి పాడి ఉత్పత్తితో జీవనం సాగించాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో ఆరుట్లలోని కో-ఆపరేటివ్ బ్యాంకులో సూపర్వైజర్గా పనిచేసే పూర్ణానంద్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 1985లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహానంతరం మౌలాలికి అక్కడి నుంచి ఉప్పల్కు మకాం మార్చారు. కుమారుడు పుట్టి మృతి చెందాడు. భర్త పూర్ణానంద్ ఆనారోగ్యానికి గురయ్యాడు. వైద్యం చేయించేందుకు సైతం చేతిలో చిల్లిగవ్వ లేకపోయింది. ఓ రోజు ఆటోలో ప్రయాణిస్తుండగా ఆమె మదిలో ఒక ఆలోచన వచ్చింది. వెంటనే డ్రైవర్ను రోజుకు ఎంత గిట్టుబాటవుతుందని ప్రశ్నించగా రూ.400 వరకు వస్తాయని చెప్పాడు. దీంతో వెంటనే బ్యాంకులో రుణం తీసుకొని 1998లో ఆటో కొనుగోలు చేసింది. మొదట్లో డ్రైవర్ ఆటో నడిపిస్తుంటే ప్రయాణికుల నుంచి కిరాయి వసూలు చేసేది తారాబాయి.
డ్రైవర్ను పెట్టుకుంటే గిట్టుబాటు కావడంలేదని స్వయంగా తానే డ్రైవింగ్ చేయాలని నిర్ణయించుకుంది. రెండుమూడు రోజుల్లోనే డ్రైవింగ్ నేర్చుకొని స్వయంగా సికింద్రాబాద్, ఉప్పల్, హయత్నగర్, కర్మన్ఘాట్, దిల్సుఖ్నగర్ రూట్లలో ఆటో నడపడం ప్రారంభించింది. 1999లో భర్త పూర్ణానంద్ అనారోగ్యంతో కన్నుమూశాడు. తనకు తోడుగా అక్క కుమారున్ని, తమ్ముని ఇద్దరు కూతుళ్లను తెచ్చుకుంది. వారి బాధ్యతలను సైతం స్వీకరించింది. ఐదేళ్ల క్రితం ఇబ్రహీంపట్నంకు మకాం మార్చింది. బ్యాంకు రుణంతో ఇల్లు ఖరీదు చేసింది. ప్రస్తుతం గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఆటో నడుపుతోంది.
అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉంది..
ఎవరి సొమ్మును ఆశించకుండా కష్టపడి సంపాదించిన దాంట్లో ఎంతో తృప్తి ఉంటుంది. స్వయం కృషితో కుటుంబ భారాన్ని మోస్తున్నా. ఎవరెన్ని రకాలుగా మాట్లాడిన అధైర్యపడకుండా ముందుకు సాగుతున్నాను. ప్రభుత్వం గుర్తించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ మహిళ అవార్డును ప్రకటించడం ఆనందంగా ఉంది. ఇది నాలాంటి వారెందరో ప్రేరణ అవుతుంది. -తారాబాయి