మడకశిర పట్టణంలో శనివారం అర్ధరాత్రి బంగారుదుకాణంలో చోరీ జరిగింది.
మడకశిర : మడకశిర పట్టణంలో శనివారం అర్ధరాత్రి బంగారుదుకాణంలో చోరీ జరిగింది. గాంధీబజార్లోని మహేశ్ఆచారికి చెందిన ఎంఎస్పీ జ్యువెలరీ వర్క్స్ దుకాణం షెట్టర్ పై భాగంలో గల వెంటిలేటర్ను తొలగించి దుండగులు లోనికి ప్రవేశించారు. షోకేస్లో ఉన్న ఆభరణాలను వదిలేసి కేవలం డ్రాలో ఉన్న 15 కిలోల వెండి, పది గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు.
సమాచారం అందుకున్న ఎస్ఐ మక్బూల్బాషా సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. చోరీ అయిన ఆభరణాల విలువ రూ.6.30 లక్షలు ఉంటుందని బాధితుడు మహేష్ఆచారి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ షాపు బంద్ చేసే సమయంలో ఆఫ్ చేసి వెళతామని బాధితుడు చెప్పాడు. దీంతో ఎస్ఐ క్లూస్టీంని రప్పించి క్షుణ్ణంగా పరిశీలించి, వేలిముద్రలు సేకరించారు. తెలిసిన వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని ఎస్ఐ చెప్పారు.