ఆర్థిక ఇబ్బందులకు తోడు ఐపీఎల్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణం తీసింది.
ఆర్థిక ఇబ్బందులకు తోడు ఐపీఎల్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. తాహతుకు మించి అప్పులు చేసి జల్సాలు చేస్తున్న యువకుడు ఐపీఎల్లో భారీగా బెట్టింగ్ కాసి ఓడి పోవడంతో.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో గురువారం వెలుగుచూసింది.
స్థానికంగా నివాసముంటున్న మధు(24) సెల్ఫోన్ దుకాణం నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో.. జల్సాలకు అలవాటు పడి క్రికెట్ బెట్టింగ్ ద్వారా సులువుగా డబ్బు సంపాదించవచ్చని ప్లాన్ వేశాడు. బుధవారం జరిగిన కోల్ కతా, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్ పెట్టాడు. బెట్ ఓడిపోవడంతో.. అప్పులు తీర్చే దారి కానరాక.. తన దుకాణంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.