నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. 34 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలు ఇటీవల రెండు మూడు డిగ్రీలు పెరగడంతో కొన్ని ప్రాంతాలు వేసవిని తలపిస్తున్నాయి.
అనంతపురం అగ్రికల్చర్ : నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. 34 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలు ఇటీవల రెండు మూడు డిగ్రీలు పెరగడంతో కొన్ని ప్రాంతాలు వేసవిని తలపిస్తున్నాయి. ఆదివారం శింగనమల మండలం తరిమెలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. తాడిపత్రి, ఎన్పీ కుంట, అనంతపురం, గుమ్మగట్ట, పెద్దవడుగూరు, యాడికి, బెళుగుప్ప, కళ్యాణదుర్గం, గుత్తి తదితర మండలాల్లో కూడా 38 డిగ్రీలపై ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 35 నుంచి 37 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 24 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.
అక్కడక్కడ తేలికపాటి వర్షం : శనివారం రాత్రి భారీ వర్షాలు పడేలా వాతావరణం నెలకొన్నా 20 నుంచి 25 మండలాల్లో తేలికపాటి నుంచి చిరుజల్లులు నమోదయ్యాయి. గుంతకల్లు, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, చెన్నేకొత్తపల్లి, యాడికి, రాప్తాడు, అనంతపురం, హిందూపురం, కూడేరు, తాడిపత్రి, గార్లదిన్నె, ఉరవకొండ, గుత్తి, కొత్తచెరువు, బత్తలపల్లి, శింగనమల, పుట్టపర్తి, ధర్మవరం, బెళుగుప్ప, గాండ్లపెంట తదితర మండలాల్లో వర్షపాతం నమోదైంది. జూలై నెల సాధారణ వర్షపాతం 67.4 మి.మీ కాగా ప్రస్తుతానికి కేవలం 27.1 మి.మీ నమోదైంది. ఈ క్రమంలో ఖరీఫ్ పంటల సాగు పడకేయగా, వేసిన పంటలు ఎండుముఖం పడుతున్న పరిస్థితి నెలకొంది.