కళేబరం ఉన్న నీటితో వంటలు: హాస్టల్లో ఆకలి కేకలు | students protests over food preparing with polluted water | Sakshi
Sakshi News home page

కళేబరం ఉన్న నీటితో వంటలు: హాస్టల్లో ఆకలి కేకలు

Nov 2 2015 4:25 PM | Updated on Sep 3 2017 11:54 AM

శ్రీకాకుళం జిల్లా రాజాం బస్డాండ్ వెనుక ఉన్న బీసీ బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌లో విద్యార్థినులు నాలుగు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు.

రాజాం (శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా రాజాం బస్డాండ్ వెనుక ఉన్న బీసీ బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌లో విద్యార్థినులు నాలుగు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు. హాస్టల్ నిర్వాహకులు వంట వండకపోవడంతో విద్యార్థినులు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డెక్కారు. హాస్టల్‌లో వంట వండటానికి పక్కనున్న బావి నుంచి నీళ్లు ఉపయోగించేవారు. నాలుగు రోజుల క్రితం బావిలో ఓ పిల్లి పడి చనిపోయింది. దాంతో పాటు మోటారు పాడైంది. అయితే మోటారును బాగుచేసినా నీటిలో ఉన్న పిల్లి కళేబరం అలానే ఉంది.

నీటిని శుద్ధి చేయకపోవడంతో వాటితోనే వండిన వంటలు.. దుర్వాసన వచ్చాయి. దీంతో పిల్లలు తినలేక పోతున్నారు. నీటిని శుద్ధిచేసి మంచినీటితో వండితేనే తింటామని భీష్మించారు. దాంతో ఆగ్రహించిన వార్డెన్ వంట వండేది లేదని తేల్చిచెప్పడంతో అప్పటినుంచి డబ్బున్న వాళ్లు హోటళ్లలో తింటుండగా డబ్బులు లేనివారు ఆకలితో పస్తులున్నారు. ఈ విషయం తెలిసిన విద్యార్థి సంఘాల నేతలు సోమవారం మధ్యాహ్నం హాస్టల్ విద్యార్థినులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఉన్నతాధికారులు పరిస్థితిని విచారించి చర్యలు తీసుకుటామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement