అనకాపల్లి జిల్లా: కొత్త అల్లుడికి అదిరిపోయే ఆతిథ్యం ఇవ్వడంలో గోదావరి జిల్లాల అత్తమామలు ముందుంటారు. వారికి దీటుగా నర్సీపట్నంలో శాంతినగర్కు చెందిన దంపతులు శ్రావణమాసానికి ఇంటికి వచ్చిన అల్లుడికి ప్రత్యేక అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఒకటో, రెండో కాదు దాదాపు 100 రకాల టిఫిన్లు పెట్టారు.
నాగం రమేష్, కళావతి దంపతులు తమ కుమార్తె లక్ష్మీనవ్యసాయిని ఇదే పట్టణానికి చెందిన పూసర్ల హర్షకు ఇచ్చి వివాహం చేశారు. ఆషాఢమాసం ముగియడంతో ఆదివారం ఇంటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు ఘనంగా స్వాగతం పలికారు. గేటు వద్ద నుంచి ఇంటి లోపలి వరకు పూలతో వంద గడులు తీర్చిదిద్దారు. ఈ గడులను దాటుకుంటూ వెళ్లిన అల్లుడికి అడుగుకో బహుమతిని బంధువులతో అందజేశారు. వంద రకాల వంటకాలతో అల్పాహార విందు ఏర్పాటు చేశారు.
గత సంక్రాంతి పండగ సమయంలో కూడా ఇదే రీతిన అల్లుడికి అత్తమామలు విందు ఏర్పాటు చేశారు. ఇడ్లీ, అటుకుల ఉప్మా, పూరీ, పులిహోర, ఉప్మా పెసరట్టు, మిల్లెట్స్ ఇడ్లీ, పెరుగు సేమియా, మసాల దోశ, పన్నీరు దోశ, ఊతప్పం వంటి రకరకాల వంటకాలు అల్పాహార విందులో పెట్టారు.



