మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా వారిపై అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదు.
కొత్తూరు: మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా వారిపై అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదు. ఏదో ఓ చోట నిత్యం వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొత్తూరులో ఓ గుర్తుతెలియని మానవమృగం ముద్దులొలికే ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్కి చెందిన ఓ మహిళ కొన్నేళ్లుగా చిరువ్యాపారం చేసుకుంటూ కొత్తూరులో నివాసం ఉంటుంది. ఏడేళ్ల తన కూతురిని స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదివిస్తోంది.
కాగా, ఈ నెల 10వ తేదీన రాత్రి 8గంటల సమయంలో కూతురు కనిపించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన పాప, జరిగిన విషయం తల్లికి చెప్పింది. తర్వాతి రోజు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం ఏఎస్పీ కల్మేశ్వర్ సింగనవర్, రూరల్ సీఐ మధుసూదన్, ఎస్ఐలు శ్రీశైలం, వీరబాబు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించామని, వైద్యుల రిపోర్టు వచ్చాక వివరాలు వెల్లడిస్తామని సీఐ మధుసూదన్ పేర్కొన్నారు.