ఇద్దరు సోదరుల అరాచకపర్వం
ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
నిందితులపై పోక్సో కేసు నమోదు
యలమంచిలి: పదేళ్లుగా ఓ మహిళను లోబరచుకుని మోసం చేసిన సంఘటనపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కలగంపూడి గ్రామానికి చెందిన కుక్కల కూర్మారావు అదే మండలానికి చెందిన ఓ మహిళకు 14 ఏళ్ల వయసుండగా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. 2016 మే 1న ఆమె ఇంటికి వెళ్లి లైంగికదాడికి పాల్పడి వీడియో తీశాడు. అప్పటి నుంచి ఆమెను బెదిరిస్తూ లైంగికదాడికి పాల్పడ్డాడు.
కూర్మారావు సోదరుడు జ్ఞానేశ్వరరావు ఆ వీడియోలు చూసి తన కోరిక కూడా తీర్చమని ఆమెను వేధించాడు. దీనిపై బాధిత మహిళ కూర్మారావును నిలదీయగా గతేడాది (2025) జూన్ 5న ఆమెకు ఉంగరం తొడిగి... ‘నువ్వు నా భార్య’వని చెప్పి జ్ఞానేశ్వరరావుపై కేసు పెట్టవద్దని బతిమాలాడు. అనంతరం సెప్టెంబర్ 28న ఆమెను పాలకొల్లులో ఓ లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. తర్వాత బాధిత మహిళ గర్భం దాల్చగా ఈ ఏడాది జనవరి 30న హైదరాబాద్ తీసుకెళ్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రసవం చేయించి ఆడ శిశువు పురిట్లోనే చనిపోయిందని చెప్పాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.
ఈ నేపథ్యంలో బాధితురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూర్మారావు, అతడి భార్య దుర్గాభవానీ, జ్ఞానేశ్వరరావు, అతడి భార్య లక్ష్మీభవానీపై పోక్సో కేసు నమోదు చేసి పాలకొల్లు రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ యేలేటి మనోహర్ తెలిపారు.


