ఢాకా: బంగ్లాదేశ్లో తీవ్ర సంచలనం రేపిన బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషులైన దంపతులకు కోర్టు ఉరి శిక్ష విధించింది. కేవలం ఐదు రోజుల్లోనే విచారణ పూర్తి చేసింది. దేశ చరిత్రలోనే ఇదొక రికార్డ్ అని న్యాయవాదులు తెలిపారు. ఘటన చోటుచేసుకున్న 19 రోజుల్లోనే ఢాకా మెట్రోపాలిటన్ చైల్డ్ రిప్రెషన్ ప్రివెన్షన్ ట్రిబ్యునల్ ఈ ఘనత సాధించిందన్నారు. మే 18వ తేదీన ఢాకాలోని పల్లబి ప్రాంతంలోని ఓ 8 ఏళ్ల బాలిక అదృశ్యమైంది.
ఆమెను అక్కడే ఓ అపార్టుమెంట్లో ఉండే సోహెల్ రాణా కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. అతడికి భార్య స్వప్నా ఖాతూన్ సహకరించింది. అనంతరం ఆ బాలికను ముక్కలుముక్కలుగా నరికి ఇంట్లోనే దాచేసి సోహెల్ పరారయ్యాడు. పోలీసులు 19వ తేదీన సోహెల్, స్వప్నలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు. జడ్జి మస్రూర్ సలెకిన్ ఆదివారం తీర్పు వెలువరించారు. నిందితులు ఇద్దరికీ ఉరి శిక్షతోపాటు, రూ.5 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకుంటే వారి ఆస్తులను వేలం వేసి, వసూలు చేయాలని ఆదేశించారు.


