ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం - Sakshi

తంగెళ్లమూడి (ఏలూరు రూరల్‌) : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ  యువకుడు  దుర్మరణం పాలయ్యాడు.  తంగెళ్లమూడి ఎఫ్‌సీఐ గిడ్డంగుల పరిసరాల్లో బుధవారం జరిగిన ఈ దుర్ఘటనపై స్థానికులు ఆందోళన చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం ఏలూరుకు వస్తోంది. ఉదయం 9.40 గంటల సమయంలో తంగెళ్లమూడి ఎఫ్‌సీఐ గిడ్డంగులు దాటగానే స్థానిక రాజేశ్వరి  నగర్‌కాలనీ నుంచి బైక్‌పై వస్తున్న కొమ్ముల ఆకాష్‌(27)ను ఢీకొట్టింది. బైక్‌ను 10 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకుపోయింది. దీంతో ఆకాష్‌ బస్సు టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక లంకపల్లికి చెందిన ఆకాష్‌ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి తల్లిదండ్రులు సత్యనారాయణ, రాధ, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఇటీవలే ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేశాడు. కుటుంబానికి ఆధారంగా ఉన్నాడు. బుధవారం ఓ భవనం వద్ద పెయింటర్లను దింపి తిరిగి వస్తుండగా, ఈ దుర్ఘటన జరిగింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు అకాల మరణం చెందడంతో ఆ తల్లిదండ్రులు తల్లిడిల్లిపోతున్నారు. డ్రైవర్‌ మితిమీరిన వేగంతో బస్సు నడపడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానిక యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు బస్సులను నిలిపేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎఫ్‌సీఐ వద్ద మలుపు ప్రమాదకరంగా ఉందని, అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.  

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top