ర్యాగింగ్ అంతంతోనే ఆమె ఆత్మకు శాంతి | Raging end with the spirit of peace risitesvari | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్ అంతంతోనే ఆమె ఆత్మకు శాంతి

Jul 24 2015 11:07 PM | Updated on Aug 24 2018 2:36 PM

విద్యార్థుల జీవితాలను బలి చేస్తున్న ర్యాగింగ్, వేధింపులపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు కదం తొక్కారు.

ఏఎన్‌యూ (గుంటూరు జిల్లా): విద్యార్థుల జీవితాలను బలి చేస్తున్న ర్యాగింగ్, వేధింపులపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు కదం తొక్కారు. యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వారు భారీ ర్యాలీ నిర్వహించారు. రిషితేశ్వరి ఆత్మహత్యనూ, తమలో ఒకరిగా ఆ విద్యార్థిని గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని తీవ్ర ఆవేదన, ఆగ్రహాలు వ్యక్తం చేశారు. యూనివర్సిటీ విద్యార్థి సంఘాలన్నీ కలిసి విద్యార్థి జేఏసీగా ఏర్పడి తరగతులను బహిష్కరించారు. యూనివర్సిటీలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి, రిషితేశ్వరి మృతికి కారకులైన వారందరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో ర్యాగింగ్‌ను అంతమొందిస్తామని, అలా రిషితేశ్వరికి ఆత్మకు శాంతి కలిగిస్తామని నినదించారు.

ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేయాలని, వసతి గృహాల్లో భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల డిమాండ్ మేరకు వారి వద్దకు వచ్చిన ఇన్‌చార్జి వీసీ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ.. ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి పూర్తిగా తప్పించామని తెలిపారు. ఘటనపై న్యాయవిచారణ జరపడం, ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయటంపై ప్రభుత్వాన్ని సంప్రదించి వచ్చే సూచనల మేరకు నడుచుకుంటామని తెలిపారు. దీనికి సంతృప్తి చెందిన విద్యార్థులు వీసీ వీటిపై నిర్ణయం చెప్పిన తరువాత తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి వెనుదిరిగారు. స్పందించిన న్యాయసేవాసాధికార సంస్థ.. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై న్యాయసేవా సాధికార సంస్థ స్పందించింది. సంస్థ కార్యదర్శి జి.లక్ష్మీనరసింహారెడ్డి ఈ కేసును సుమోటోగా తీసుకొని విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విభాగం ప్రిన్సిపాల్, వార్డెన్‌లకు నోటీసులు జారీ చేశారు.

రిషితేశ్వరి మృతిపై వివరణ ఇచ్చేందుకు వారిద్దరూ ఆగస్టు 1న సంస్థ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నిజనిర్ధారణ కమిటీతో మాట్లాడటానికి ఇష్టపడని రిషితేశ్వరి తల్లిదండ్రులు.. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై నాగార్జున యూనివర్సిటీ నియమించిన నిజనిర్ధారణ కమిటీతో మాట్లాడటానికి ఆమె తల్లిదండ్రులు నిరాకరించారు. కూతురిని కోల్పోయిన ఆవేదనలో ఉన్నవారికి వర్సిటీ కమిటీపై విశ్వాసం లేనట్టుగా తెలుస్తోంది. ఇలాంటి కమిటీలతో ప్రయోజనం ఉండదని తమ కుమార్తె మృతిపై న్యాయ విచారణ జరగాలని వారు కోరుతున్నారు. వర్సిటీ ఏర్పాటు చేసే కమిటీలు నిజాలను నీరుగారుస్తాయి తప్ప వాటితో మరో ప్రయోజనం ఉండదని ఏఎన్‌యూ పోకడలను పరిశీలిస్తున్న వారు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement