జీఓ 279 రద్దుకు రాష్ట్రవ్యాప్త ఉద్యమం | municipal workers warns to ap govt over strike | Sakshi
Sakshi News home page

జీఓ 279 రద్దుకు రాష్ట్రవ్యాప్త ఉద్యమం

Jun 20 2016 10:24 AM | Updated on Oct 16 2018 7:36 PM

పట్టణ ప్రాంతాల్లో చెత్తలు ఎత్తుకుంటూ ప్రజారోగ్యాన్ని పర్యవేక్షించే ఎస్సీ, ఎస్టీల పొట్ట కొట్టేవిధంగా ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ మండిపడ్డారు.

విజయనగరం: పట్టణ ప్రాంతాల్లో చెత్తలు ఎత్తుకుంటూ ప్రజారోగ్యాన్ని పర్యవేక్షించే ఎస్సీ, ఎస్టీల పొట్ట కొట్టేవిధంగా ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ మండిపడ్డారు.

జీఓ నంబర్ 279 రద్దు కోరుతూ రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 26 నుంచి 29 వరకు విజయవాడలో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాసభల్లో దీనిపై తీర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు. ఆదివారం పట్టణంలోని కె.ఎల్.పురంలో ఉన్న సంఘం భవనంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని విజయనగరం మున్సిపాలిటీలో 309 మంది, బొబ్బిలిలో 152 మంది, సాలూరులో 140 మంది, పార్వతీపురంలో 125 మంది కార్మికులు కాంట్రాక్ట్ పద్ధతిలో 15 ఏళ్లుగా పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వారందరినీ రోడ్డున పడేసే విధంగా వ్యవహరిస్తోందన్నారు.

జీఓ నంబర్ 279ను అమలు చేసి యంత్రాలతో పారిశుధ్య పనులు నిర్వహించటంతోపాటు పనిని ఔట్‌సోర్సింగ్ చేసేందుకు కుట్రలు పన్నుతోందని తెలిపారు. భవిష్యత్‌లో పూర్తిగా యంత్రాలతో పనులు చేపట్టి  కార్మికులకు ఉపాధి లేకుండా చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. నూతన విధానం అమలుకు మున్సిపల్ యంత్రాంగం ప్రయత్నిస్తే పనులు బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.శంకరరావు, ఉపాధ్యక్షుడు గొర్లె వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.గాంధీ, బి.భాస్కరరావు, టి.శంకరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement